సిటీబ్యూరో, అక్టోబరు 8 (నమస్తే తెలంగాణ ) ః జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోనే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఆమలులో ఉంటుందని జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ తెలిపారు. ఎన్నికలు జరిగే అసెంబ్లీ నియోజకవర్గం రాష్ట్ర రాజధాని లేదా మెట్రో పాలిటన్ నగరాలు, మునిసిపల్ కార్పొరేషన్లలో ఉంటే ఎన్నికల ప్రవర్తన నియామవళి కేవలం ఆ అసెంబ్లీ నియోజకవర్గానికి మాత్రమే వర్తిస్తుందన్న నిబంధనలను కేంద్ర ఎన్నికల సంఘం వెలువరించిందని చెప్పారు.
ఈ నిబంధనల ప్రకారం జూబ్లీహిల్స్ నియోజకవర్గం రాష్ట్ర రాజధానితోపాటు మెట్రోపాలిటన్ నగరంలో భాగస్వామ్యం కావడంతో కేవలం జూబ్లీహిల్స్ అసెంబ్లీకి మాత్రమే ఎన్నికల కోడ్ వర్తిస్తుందని ఆర్వీ.కర్ణన్ స్పష్టం చేశారు. బుధవారం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.
జిల్లా ఎన్నికల అధికారి జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ.కర్ణన్ ఉప ఎన్నిక షెడ్యూల్ను రాజకీయ పార్టీల ప్రతినిధులకు వివరించారు. ఈ నెల 6వ తేదీన ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన వెంటనే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని, ఎన్నికల ప్రవర్తన నియమావళికి లోబడి రాజకీయ పార్టీలు, ప్రతినిధులు ఎన్నికల ప్రచారం నిర్వహించాలని కర్ణన్ తెలిపారు. ఎన్నికల కోడ్ను ఉల్లంఘిస్తే బాధ్యులపై కేసులు నమోదు చేస్తామన్నారు.
షేక్ పేటలో ఆర్వో కార్యాలయం
షేక్పేట తహశీల్దార్ ఆఫీస్లో రిటర్నింగ్ అధికారి కార్యాలయం ఏర్పాటు చేసినట్లు కర్ణన్ తెలిపారు. ఈ నెల 13 నుంచి నామినేషన్లు స్వీకరిస్తామని చెప్పారు. ఈఉప ఎన్నికలో ఈవీఎంలపై అభ్యర్థుల కలర్ ఫొటోలు ఉంటాయని తెలిపారు. రాష్ట్రంలో కలర్ ఫొటోలు పెట్టడం ఇదే తొలిసారి అని చెప్పారు.
ఈ సమావేశంలో జిల్లా జాయింట్ సీపీ ఇక్భాల్, ఎన్నికల అదనపు కమిషనర్ హేమంత్ కేశవ్ పాటిల్, డీసీపీ అపూర్వ్ రావు, రిటర్నింగ్ అధికారి పి.సాయిరాం, పార్టీల ప్రతినిధులు కె.నందేశ్ కుమార్ (బీఎస్పీ), కొల్లూరు పవన్ కుమార్, ఎల్. దీపక్ (బీజేపీ), విజయ్ మల్లంగి (ఆప్), ఎం.శ్రీనివాసరావు (సీపీఎం), పి.రాజేశ్ కుమార్, మహ్మద్ వాజీద్ హుస్సేన్, జి.రాఘవేందర్ (కాంగ్రెస్), ఎ.శ్రీనివాస్ గుప్తా, కె.మాధవ్, కిషోర్ గౌడ్ (బీఆర్ఎస్), ప్రశాంత్ రాజ్ యాదవ్ (టీడీపీ), సయ్యద్ ఖలీలుద్దీన్ (ఎంఐఎం) హాజరయ్యారు.