మన్సూరాబాద్, నవంబర్ 29: ఇంటి ముందు పార్కింగ్ చేసిన ఆటోలను దొంగిలిస్తున్న ఎనిమిది మంది ముఠా సభ్యులను ఎల్బీనగర్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 9 ఆటోలు, 8 మొబైల్ ఫోన్లు, వాహనాల ఒరిజినల్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లతో పాటు ఇతర సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎల్బీనగర్ పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ శ్రీధర్రెడ్డి వివరాలను వెల్లడించారు.
నగరం, శివారుల్లోని వేర్వేరు ప్రాంతాలకు చెందిన మహ్మద్ వాజిద్అహ్మద్ (51), మహ్మద్ సలీంఅలీ (40), మహ్మద్ రషీద్ (38), అంజాద్ఖాన్ (38), మహ్మద్ రిజ్వాన్ అలియాస్ అజ్జు (47), మహ్మద్ షకీల్ (36), హైదర్ హుస్సేన్ (45), సయ్యద్ మునీర్అలీ (25) ఒక ముఠాగా ఏర్పడ్డారు. ఇందులో మహ్మద్ రిజ్వాన్, మహ్మద్ షకీల్ పాత నేరస్తులు. వీరంతా జల్సాలకు అలవాటు పడి, డబ్బు కోసం ఆటోలను దొంగిలిస్తున్నారు. ముఠా నాయకుడిగా మహ్మద్ వాజిద్ అహ్మద్ వ్యవహరిస్తున్నాడు. రాత్రి సమయంలో బస్తీల్లో తిరుగుతూ.. ఇండ్ల ముందు పార్కింగ్ చేసిన ఆటోలను దొంగిలిస్తున్నారు. దొంగిలించిన పాత ఆటోలను స్క్రాబ్కు విక్రయిస్తున్నారు. చోరీ చేసిన ఆటోలకు సంబంధించిన ఒరిజినల్ డాక్యుమెంట్లు, ఇంజన్ నంబర్లను ఇతర పాత ఆటోలకు ఉపయోగించి, ఆ ఆటోలను మార్కెట్లో విక్రయిస్తున్నారు. కొన్ని ఆటోలను అద్దెకు కూడా ఇచ్చారు.
మన్సూరాబాద్లోని శ్రీరామ్నగర్ కాలనీకి చెందిన శ్రీహరి తన వాహనాన్ని ఇంటి ముందు పార్కింగ్ చేయగా.. దొంగలు ఎత్తుకెళ్లారు. శ్రీహరి ఫిర్యాదు మేరకు ఎల్బీనగర్ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరాల్లో లభించిన ఆధారాలతో దర్యాప్తును ముందుకు తీసుకెళ్లిన పోలీసులు.. పక్కా సమాచారంతో మంగళవారం యాకుత్పురలో నిందితులను పట్టుకున్నారు. నిందితులు మహ్మద్ వాజిద్ అహ్మద్, మహ్మద్ సలీం అలీ, మహ్మద్ రషీద్, అంజాద్ఖాన్, మహ్మద్ రిజ్వాన్, మహ్మద్ షకీల్, హైదర్ హుస్సేన్, సయ్యద్ మునీర్ అలీని అరెస్టు చేసి, రిమాండ్కు తరలించారు. వారి వద్దనుంచి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ఈ సమావేశంలో ఎల్బీనగర్ సీఐ అంజిరెడ్డి, డీఐ ఉపేందర్ రావు, క్రైమ్ ఎస్సై నరేందర్ తదితరులు పాల్గొన్నారు.