అవును గుడ్డు ‘ఏడు’పిస్తున్నది. ఆరోగ్యానికి మేలు చేసే ఈ పౌష్టికాహారం సామాన్యులకు అందకుండాపోతున్నది. దాణా ఖర్చులు పెరగడం, ఇతర రాష్ర్టాలకు ఎగుమతి అవుతుండటం ఇలా వివిధ కారణాలతో గుడ్ల ధరలకు రెక్కలొచ్చాయి. ప్రస్తుతం మార్కెట్లో ఒక్కో గుడ్డు రూ. 7 కావడంతో కొనాలంటేనే మధ్యతరగతి కుటుంబాలు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
సిటీబ్యూరో, డిసెంబర్ 4 (నమస్తే తెలంగాణ) : కోడిగుడ్ల ధరలు కొండెకాయి. కొవిడ్ తర్వాత రోగనిరోధక శక్తిని పెంచుకునేందుకు ప్రజలు కోడిగుడ్లను విరివిగా వినియోగిస్తున్నారు. కొద్ది రోజుల కిందట కార్తికమాసం కావడంతో వినియోగం కొంతమేర తగ్గి ఒకో గుడ్డు రూ.5.50 పలికింది. కార్తికమాసం ముగియడంతో గుడ్ల ధరలకు మరలా రెకలొచ్చాయి. డజను గుడ్ల ధర రూ. 80కి పెరగగా..ఒక్కో గుడ్డు ధర రూ. 7 అయింది. వినియోగంతో పాటు ..దాణా ధరలు పెరగడమే అధిక ధరలకు కారణమని వ్యాపారులు చెబుతున్నారు. కాగా గ్రేటర్లో రోజూ 70 లక్షల గుడ్ల వినియోగం ఉంటుంది. రాబోయే రోజుల్లోనే ఒక్క గుడ్డు రూ.10 వరకు పెరిగే అవకాశాలు లేకపోలేదని నిర్వాహకులు పేర్కొంటున్నారు.
‘గుడ్లు’ తేలేసేలా ధర
గుడ్డు ధర మార్కెట్లో రికార్డు స్థాయికి చేరింది. ప్రస్తుతం వంద గుడ్లకు రైతుకు చెల్లించే ధర రూ.541గా ఉండగా.. గత వారంలో రూ.65 వరకు ఉన్న డజన్ కోడి గుడ్ల ధర ఇప్పుడు ఏకంగా రూ.80 వరకు చేరింది. మరోవైపు గిట్టుబాటు కాక కొంతమంది కోళ్ల ఫారాల రైతులు బ్యాచ్లు తగ్గించారు. దీంతో గుడ్ల ఉత్పత్తి తగ్గి కోడిగుడ్ల ధరలు పెరిగాయని వ్యాపారులు పేర్కొంటున్నారు.
దాణా ధరలు, కేకుల్లో వినియోగం..
కోళ్లకు వేసే దానా ధర నానాటికీ పెరిగిపోవడంతో పాటు రానున్న క్రిస్మస్ పర్వదినం సందర్భంగా కేకుల తయారీలో విరివిగా గుడ్లను వినియోగిస్తుండడంతో అమాంతంగా గుడ్ల ధరలు పెరగడానికి కారణమని నేషనల్ ఎగ్ కో-ఆర్డినేషన్ కమిటీ(నెక్) పేర్కొంటుంది. ఆదే కాకుండా కోళ్లకు వేసే దాణా ధర గత ఏడాది క్రితం రూ.28 నుంచి 30 ఉండగా ప్రస్తుతం 36 నుంచి 38కి పెరిగిందని చెబుతున్నారు. రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే కోడిగుడ్లు ఇతర రాష్ట్రాలకు ఎగుమతి అవుతుండటంతో రేట్లు అమాంతం పెరిగాయి.
డిమాండ్ ఉంది.. సప్లయ్ లేదు
గత కొన్ని రోజులుగా కోడిగుడ్లకు డిమాండ్ పెరిగింది. కానీ.. సప్లయ్ తక్కువగా ఉంది. డిమాండ్ పెరగడంతో రూ.5.80లకు ఒక కోడిగుడ్డు వస్తుంది. బయట దీనిని అమ్మాలంటే రూ.7 లు తీసుకోవాలి. దీనివల్ల కోడిగుడ్లు అమ్మడం లేదు. కార్తిమాసం ముగిసి చలి పెరిగింది కాబట్టి గుడ్డు తినేవారు ఎక్కువయ్యారు.
– మురళీధర్ రెడ్డి, చికెన్ షాప్ నిర్వాహకుడు
ప్రతి ఒక్కరికి ప్రీతిపాత్రమే
మార్కెట్కు వెళ్తే కూరగాయలు.. పండ్లతో పాటు తప్పనిసరిగా కోడిగుడ్డు తెచ్చుకుంటాం. ఆరోగ్యరీత్యా.. తొందరగా కూర వండాలన్నా కోడిగుడ్డు ఉంటే చాలు. ఉద్యోగాలకు వెళ్లేవారికి, పాఠశాలకు వెళ్లేవారికి మధ్యాహ్న భోజనం వండి బాక్సులో పెట్టి పంపాలంటే కోడిగుడ్డును మించింది లేదు. కార్తికమాసం ముగిసిన తర్వాత కోడిగుడ్డు ధర రూపాయి పెరిగింది. మార్కెట్లో సరిపడా కోడిగుడ్లు రావడం లేదని అంటున్నారు.
– భవాని, గృహిణి, కేపీహెచ్బీ కాలనీ
కొరత కారణంగానే ధరల పెరుగుదల
గుడ్ల ఉత్పత్తి తగ్గడానికి ప్రధాన కారణం రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న కోడి గుడ్లను ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేయడమే. దీంతో పాటు అన్ని కోళ్లు గుడ్లు ఉత్పత్తి అయ్యే సమయంలోనే చికెన్ సెంటర్లకు తరలించడం ఓ కారణంగా చెప్పవచ్చు. అదేవిధంగా చలికాలం కావడంతో కోడి గుడ్ల వినియోగం మరింత పెరిగింది.
– వెంకటేశ్వర్రెడ్డి, కోడిగుడ్ల వ్యాపారి, బొల్లారం
నిర్వహణ ఖర్చులు ఎక్కువ
అమెరికా, బ్రిటన్, ఇతర దేశాలతో పోల్చితే దేశీయంగా రైతులు, ఉత్పత్తిదారులకు మిగిలే మార్జిన్ చాలా తక్కువ. ప్రస్తుతం హోల్సేల్ మార్కెట్లకు విక్రయించే గుడ్ల ధరలతో కోళ్ల దాణా, నిర్వహణకే సరిపోతున్నాయి. ఆశించిన మేర ధరను రైతులు, ఉత్పత్తిదారులు పొందలేకపోతున్నారు.
– చింతావర్ సంజీవ్, ఎన్ఈసీసీ- బిజినెస్ మేనేజర్