గోల్నాక : నియోజకవర్గ వ్యాప్తంగా విస్తృతంగా పాదయాత్రలు చేపడుతూ స్థానిక సమస్యల పరిష్కారానికి సత్వరమే చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ తెలిపారు. శుక్రవారం గోల్నాక తులసీనగర్ కాలనీ సాయిబాబా గుడి లేన్, అశోకానగర్, లక్ష్మినగర్ తదితర ప్రాంతాల్లో పలు శాఖల అధికారులతో కలసి ఆయన క్షేత్రస్థాయిలో పాదయాత్ర నిర్వహించారు.
స్థానికులను అడిగి సమస్యలు తెలుసుకున్నారు. ముఖ్యంగా తమ బస్తీల్లో కలుషిత మంచినీటి సమస్య పరిష్కరించాలని స్థానికులు ఎమ్మెల్యే దృష్టకి తీసుకువచ్చారు. అలాగే అరకొర మంచినీటి సరఫరాతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే సమస్యను పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
అశోక్నగర్, లక్ష్మినగర్ తదితర ప్రాంతాల్లో కొత్త మంచినీటి పైప్లైన్ ఏర్పాటు కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాలేరు మాట్లాడుతూ…నియోజకవర్గ వ్యాప్తంగా మౌలిక వసతుల కల్పనకు అధిక ప్రాధన్యతనిస్తున్నామన్నారు.
ఈ కార్యక్రమంలో సీజీఎం ఆనంద్నాయక్, జీఎం సుబ్బారాయుడు, డీజీఎం బ్రహ్మారెడ్డి, మేనేజర్ రోహిత్తో పాటు స్థానిక టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.