గోల్నాక, జనవరి 31 : తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను నాయీబ్రాహ్మణులు ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ పిలుపునిచ్చారు. మంగళవారం హైదరాబాద్ జిల్లా నాయీబ్రాహ్మణుల సంఘం ఆధ్వర్యంలో అంబర్పేట మహారాణా ప్రతాప్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నాయీబ్రాహ్మణుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారని చెప్పారు.
బార్బర్ షాపులకు కమర్షియల్ విద్యుత్ కనెక్షన్ రద్దు చేయాలని 30 ఏండ్లుగా ప్రాధేయపడుతున్న గత పాలకులు విస్మరించారన్నారు. అయితే కుల, చేతి వృత్తులను కాపాడు కోవాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ నెలకు 250 యూనిట్ల విద్యుత్ బిల్లు రద్దు చేశారని ఆయన గుర్తు చేశారు. బడుగు, బలహీన వర్గాలు యాచించే స్థాయి నుంచి శాసించే స్థాయికి ఎదగాలని పిలుపునిచ్చారు. నాయీబ్రాహ్మణుల ఫెడరేషన్ ఏర్పాటుకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
అంబర్పేట నియోజకవర్గంలో పదిహేనేండ్లలో జరగని అభివృద్ధి కేవలం మూడేండ్లలో చేసి చూపించామని పేర్కొన్నారు. అనంతరం నాయీబ్రాహ్మణుల నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ సమ్మేళనంలో నాయీబ్రహ్మణ సంఘం ప్రతినిధులు కె.కృష్ణనాయీ, కె.సురేశ్నాయీ, కె.శ్రీనివాస్ నాయీ, కె.శ్రీనివాసులు నాయీ, ఎం. సత్యనారాయణనాయీ, మహేశ్నాయీ, బాలకృష్ణనాయీ, వేణుగోపాల్ నాయీ, మహేందర్నాయీ, ప్రసాద్నాయీ పాల్గొన్నారు.