నేరేడ్మెట్, ఏప్రిల్ 9: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ దళితులకే కాదని యావత్ సమాజానికి దిశా నిర్దేశం చేసిన గొప్ప మహనీయుడని ఎంఎస్ఎస్వో చైర్మన్ డాక్టర్ మైనంపల్లి రోహిత్ బాబు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహనీయుల విగ్రహాల ఏర్పాటుకు ఆర్థిక సాయం అందజేస్తున్నట్లు తెలిపారు. ఆదివారం నేరేడ్మెట్ డివిజన్ సీబిఎన్ కాలనీలో అంబేద్కర్, బాబూ జగ్జీవన్ రామ్, జ్యోతిరావు ఫూలే విగ్రహాలను ఏర్పాటు చేయాలని గతంలో ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు దృష్టికి స్థానికులు తీసుకువెళ్లగా విగ్రహాలను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారని అన్నారు. ఈ నేపథ్యంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేసేందుకు రూ. 2.20లక్షల చెక్కును కాలనీవాసులకు ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు కొడుకు మైనంపల్లి రోహిత్ బాబు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపేందర్రెడ్డి, ఎస్ ఆర్ ప్రసాద్, జీఎన్వీ సతీశ్కుమార్, గోకుల్కుమార్, చెన్నారెడ్డి, గోపీనాథ్, బాలకృష్ణ గుప్త, గంగాధరి కృష్ణ, పీఎస్ శ్రీనివాస్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
పేదల వైద్యానికి రూ. 50వేలు ఆర్థిక సాయం..
ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురైనవారిని ఎంఎస్ఎస్వో చైర్మన్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు తనయుడు డాక్టర్ మైనంపల్లి రోహిత్ బాబు పరామర్శించి ఆర్థిక సాయాన్ని అందించారు. వినాయకనగర్ డివిజన్లో నివాసం ఉంటున్న కమలాకర్, హిమబిందు మరో ముగ్గురికి ఆర్థిక స్తోమత లేకపోవడంతో మెరుగైన వైద్యం చేయించుకోలేక ఇంటివద్ద ఉంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న రోహిత్ బాబు వారు మెరుగైన వైద్యం చే యించుకొనేందుకు రూ. 50వేలు ఆర్థిక సాయం అందించారు. తమకు సాయం అందించిన మైనంపల్లి రోహిత్ బాబుకు రుణపడి ఉంటామని వారు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.