సిటీబ్యూరో, జూన్ 7 (నమస్తే తెలంగాణ): స్టాక్ ట్రేడింగ్లో భారీ లాభాలిప్పిస్తామని నమ్మిస్తూ సైబర్నేరగాళ్లు విద్యావంతులపై వల వేస్తున్నారు. ఇందులో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు సైతం చిక్కి భారీగా మోసాలకు గురవుతున్నారు. ట్రేడింగ్ మోసాల్లో అత్యాశకు పోయి మోసపోతున్న వారే ఉండడం ఆందోళన కలిగిస్తోంది. సోషల్మీడియా ఫ్లాట్ఫామ్ను అడ్డాగా చేసుకొని సైబర్నేరగాళ్లు బాధితులను ఆకర్షిస్తున్నారు. సోషల్మీడియాలో వచ్చే ఈ స్టాక్ ట్రేడింగ్ ప్రకటనలను చూసి, లింక్లు క్లిక్ చేస్తూ నేరగాళ్లు వేసే వలకు చిక్కుతున్నారు. ఆ తరువాత కొంత మొత్తం పెట్టి అదృష్టాన్ని పరిశీలించుకుందామని వెళ్లేవారు కొందరైతే.. సైబర్నేరగాళ్లు చెప్పేది నిజమని గుడ్డిగా నమ్మి పెట్టుబడి పెట్టేవాళ్లు కొందరు ఉంటున్నారు.
సైబర్నేరగాళ్లు స్టాక్ ట్రేడింగ్ మోసాలు చేసేందుకు రోజురోజుకు కొత్తకొత్త ఎత్తులతో సోషల్మీడియాలో ప్రకటనలు గుప్పిస్తున్నారు. ఈ ప్రకటనలలో ఏఐ ఆధారిత వీడియోలను సైతం తయారు చేస్తూ, ప్రముఖల వీడియోలు తయారు చేస్తున్నారు. ఇందులో కేంద్ర ఆర్థిక మంత్రి వీడియోలు, ప్రతిపక్ష నాయకుల వీడియోలు, ప్రముఖ సంస్థల ప్రతినిధుల వీడియోలను తయారు చేసి అమాయకులను మోసం చేస్తున్నారు. ఇలాంటి వాటితో ఎక్కువగా రిటైర్డు ఉద్యోగులు మోసపోతుండడం ఆందోళన కలిగిస్తోంది. ట్రై పోలీస్ కమిషనరేట్లలోని సైబర్ ఠాణాలకు వచ్చే ఫిర్యాదులలో 70 శాతం ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ ఉంటుంది. డిజిటల్పై పట్టున్న వారు సైతం ఈజీగా సైబర్నేరగాళ్ల చేతికి చిక్కి మోసపోతున్నారు.
ఈజీ మనీతోపాటు వేగంగా లక్షల్లో సంపాదించవచ్చనే అత్యాశ బాధితుల కొంప ముంచుతున్నది. సైబర్నేరగాళ్లు దీనిని ఆసరాగా చేసుకుంటూ స్టాక్ ట్రేడింగ్లో లాభాలు సంపాదించే మెలుకువల పేరుతో బాధితులను బుట్టలో పడేస్తున్నారు. స్టాక్ ట్రేడింగ్లో జరుగుతున్న మోసాలపై పోలీసులు కూడా ఎక్కువగా అవగాహన కల్పించకపోవడం, బాధితులంతా సోషల్మీడియా ప్లాట్ఫామ్పైనే ఎక్కువగా ఆధారపడుతుండడంతో ఈజీగా మోసానికి గురవుతున్నారు. ఇంటర్నెట్ ఎవరికి వారు స్టాక్ ట్రేడింగ్లో తాము నిపుణులమంటూ చెప్పుకునే మాటలకు విద్యావంతులు ఈజీగా బోల్తా పడుతున్నారు. స్టాక్ ట్రేడింగ్ అంటే ఏమిటీ..? అసలు స్టాక్ ట్రేడింగ్ ఎక్కడ చేస్తారు.? స్టాక ట్రేడింగ్ నిర్వహించే అసలైన ఏజెన్సీలు ఎన్ని ఉన్నాయి? అనే కనీస పరిజ్ఞానం లేకుండానే బాధితులు ట్రేడింగ్లోకి అడుగుపెడుతున్నారు.
ట్రేడింగ్లో ఒకేసారి లక్షలు సాంపదించవచ్చనే భావనే బాధితులు మోసపోవడానికి ప్రధాన కారణంగా ఉంటుందని పోలీసులు పేర్కొంటున్నారు. వెయ్యి రూపాయల పెట్టుబడి పెట్టి తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని ట్రేడింగ్లోకి అడుగు పెడుతున్న బాధితులు వెయ్యి నుంచి పదివేలు, లక్షలు ఇలా దఫదఫాలుగా పెట్టుబడులు పెడుతూ సైబర్నేరగాళ్లు వేసిన వలలో చిక్కుకుంటున్నారు. ఇలా కొంత దూరం వెళ్లిన తరువాత తాము మోసపోతున్నామని తెలిసినా… దాని నుంచి వెనక్కి అడుగు వేయకుండా మరికొంత పెట్టుబడి పెడితే అప్పటి వరకు పెట్టిన పెట్టుబడి అంతా తిరిగి రాబట్టుకోవచ్చనే ఉద్దేశ్యంతో వేల నుంచి లక్షల్లో పెట్టుబడులు పెడుతూ చివరకు తమ ఆస్తులను సైతం అమ్మేసి సైబర్నేరగాళ్ల బ్యాంకు ఖాతాల్లో పోసేస్తుండడం ఆందోళన కలిగిస్తోంది.