సిటీబ్యూరో, ఏప్రిల్ 28 (నమస్తే తెలంగాణ) : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు జీహెచ్ఎంసీ ప్రవేశపెట్టిన ఎర్లీబర్డ్ స్కీం గడువు ఆదివారంతో ముగియనున్నది. ఈ ఆర్థిక సంవత్సరానికి ముందస్తుగా ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లించే వారికి రాష్ట్ర ప్రభుత్వం 5 శాతం రిబేట్ ప్రకటించింది. ఈ నెల 1 నుంచి 30 వరకు ఈ వెసులుబాటు కల్పించింది. ఈ నేపథ్యంలోనే గడిచిన 28 రోజుల్లో సుమారు 6. 35 లక్షల మంది సద్వినియోగం చేసుకోగా…తద్వారా రూ. 620కోట్ల ఆదాయాన్ని జీహెచ్ఎంసీ సమకూర్చుకున్నది. గత ఆర్థిక సంవత్సరంలో ఎర్లీబర్డ్ స్కీం ద్వారా ఏకంగా రూ. 741.35కోట్ల మేర ఆదాయం సమకూర్చుకోగా..ఈ సారి రూ. 750కోట్ల నిర్దేశిత లక్ష్యం ఖరారైంది.మరో రెండ్రోజుల్లో లక్ష్యాన్ని అధిగమించే దిశగా విస్తృత అవగాహన చేపడుతున్నారు. ఈ ఎర్లీబర్డ్ పథకం ఆస్తిపన్ను చెల్లింపునకు గడువు ముగుస్తుందని, పెండింగ్లో పెట్టకుండా సత్వరమే పన్ను చెల్లించి 5 శాతం రిబేట్ పొందాలని అధికారులు సూచించారు. 30న ఆదివారం కూడా సిటిజన్ సర్వీస్ సెంటర్లు తెరిచే ఉంటాయని పేర్కొన్నారు.