సిటీబ్యూరో, ఏప్రిల్ 30(నమస్తే తెలంగాణ) : జీహెచ్ఎంసీ ప్రకటించిన ‘ఎర్లీబర్డ్’ స్కీంను ఆస్తిపన్ను చెల్లింపుదారులు భారీ సంఖ్యలో సద్వినియోగం చేసుకున్నారు. జీహెచ్ఎంసీ చరిత్రలోనే రికార్డు స్థాయిలో ఎర్లీబర్డ్ వసూళ్లను రాబట్టుకున్నది. ముందుస్తుగా ఆస్తిపన్ను చెల్లించి 5 శాతం రాయితీ పొందాలంటూ ఏప్రిల్ 1 నుంచి 30వ తేదీ వరకు యజమానులకు జీహెచ్ఎంసీ అవకాశం కల్పించింది. 30 సర్కిళ్ల పరిధిలో సీఎస్సీ సెంటర్లు, బిల్ కలెక్టర్లు, మీ సేవా, ఆన్లైన్ చెల్లింపుల ద్వారా రూ. 750కోట్ల నిర్దేశిత లక్ష్యాన్ని ఖరారు చేసుకున్నది. జోన్ల వారీగా లక్ష్యాలను ఖరారు చేసింది. అయితే ఆదివారం సాయంత్రం వరకే లక్ష్యాన్ని అధిగమించి రూ.765కోట్లకు పైగా వసూళ్లను రాబట్టుకున్నది. 18 లక్షల మందిలో 7.50 లక్షల మంది ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకున్నారు. కాగా, చివరి రోజూ దాదాపు రూ.50కోట్ల మేర ఆదాయం రావడం గమనార్హం. అన్ని జోన్ల కంటే కూకట్పల్లి, శేరిలింగంపల్లి జోన్ల నుంచి అనూహ్య స్పందన రాగా.. ఎక్కువగా ఆన్లైన్లో చెల్లించేందుకు మొగ్గు చూపారు.