ఉస్మానియా యూనివర్సిటీ, ఫిబ్రవరి 6 : ఉస్మానియా యూనివర్సిటీలో నిరుద్యోగుల సమస్యలపై మంగళవారం నిర్వహించిన కార్యక్రమానికి ఎమ్మెల్సీ, ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ హాజరుకానున్న నేపథ్యంలో ఓయూలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గతంలో చీరలు, గాజులతో ఓయూ పోరాట పటిమను అవమానించిన వెంకట్కు ఓయూ గడ్డపై కాలుమోపే అర్హత లేదని, ఆయనను అడ్డుకుంటామని బీఆర్ఎస్వీ నాయకులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో మంగళవారం తెల్లవారుజాము నుంచి హాస్టళ్ల నుంచి బీఆర్ఎస్వీ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఈ సందర్భంగా విద్యార్థి నేతలు మాట్లాడుతూ.. నిర్బంధాలతో ఏమీ చేయలేరని, ముందస్తు అరెస్టులు చేయడం పిరికిపంద చర్యగా అభివర్ణించారు. మాజీ ముఖ్యమంత్రి, తెలంగాణ అభివృద్ధి ప్రధాత కేసీఆర్పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే చూస్తూ ఊరుకోబోమన్నారు. కాంగ్రెస్ పార్టీ జీవో నంబర్ 46ను రద్దు చేస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ప్రభుత్వం రావడంతోనే జాబ్ క్యాలెండర్ ప్రకటించినప్పటికీ, రెండు నెలలు గడుస్తున్నా ఆ ఊసే ఎత్తడం లేదని విమర్శించారు. నిరుద్యోగులకు న్యాయం జరిగే వరకు వారి పక్షాన పోరాటం చేస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో బీఆర్ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి జంగయ్య, నాయకులు శివ, మిథున్, నాగేందర్రావు, అవినాశ్ తదితరులు ఉన్నారు.