సిటీబ్యూరో, డిసెంబర్ 2 (నమస్తే తెలంగాణ) : ఓట్ల లెక్కింపు సందర్భంగా శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా ఉండేందుకు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్ల పరిధిలో 144 సెక్షన్ను విధిస్తున్నట్లు పోలీసు కమిషనర్లు వెల్లడించారు. ట్రై కమిషనరేట్ల పరిధిలో ఆదివారం ఉదయం 6 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు ర్యాలీలు, సభలు, సమావేశాలు, రాస్తారోకోలు నిర్వహించడం నిషేధమన్నారు.
అంతే కాకుండా ఐదు లేదా అంతకంటే ఎక్కువ మంది ఒక చోట గుమిగూడడం, ఊరేగింపుగా లేదా ర్యాలీగా వెళ్లడం నిషేధమని పోలీసు అధికారులు ఉత్తర్వులలో పేర్కొన్నారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.