దుండిగల్, ఫిబ్రవరి 11: నకిలీ పత్రాలు తయారు చేసి, భూకబ్జాలకు పాల్పడుతున్న నిందితులను దుండిగల్ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. బెంగళూరు నివాసి కృష్ణమూర్తికి గండిమైసమ్మ సమీపంలోని దొమ్మరపోచంపల్లిలో 300 గజాల స్థలం ఉన్నది. స్థలానికి సంబంధించిన పాత డాక్యుమెంట్ల వివరాలు సేకరించిన కొందరు.. ఆ స్థలం ఆక్రమణకు తెరలేపారు. ఇందుకోసం లే అవుట్ చేసిన వ్యక్తి పేరిట నకిలీ డాక్యుమెంట్లు తయారు చేసి.. తమపేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు.
ఇటీవల ఆ పత్రాలతో భూమిని అమ్మేందుకు ప్రయత్నిస్తుండగా.. విషయం తెలుసుకున్న కృష్ణమూర్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో భూకబ్జాకు పాల్పడిన వారిపై కేసు నమోదు చేశారు. నిందితులు కవాడిగూడ నివాసి సయ్యద్ ఆజం అలీ (47), మహ్మద్ మాజిద్ ఖాన్ (24), దుండిగల్కు చెందిన మహ్మద్ బాబాఖాన్(58) యూసఫ్గూడకు చెందిన సయ్యద్ ముజీబుల్లాఖాద్రీ (34), బీరాంగూడ నివాసి చౌదరి సతీశ్ బాబు(36), శేరిలింగంపల్లి నివాసి తెల్లాపురం విజయ్కుమార్(35)ను అరెస్ట్ చేసి, రిమాండ్కు పంపారు. భూకబ్జాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.