మల్లేపల్లిలోని ఐటీఐ మార్గం ఇది. కొన్నాళ్ల కిందట ఇక్కడ చెత్తాచెదారం పోగై దుర్వాసన వచ్చేది. ఈ రోడ్డులో వెళ్లాలంటే జంకేవారు. మేయర్ విజయలక్ష్మి గతేడాది ఇక్కడ పర్యటించి రూపురేఖలు మార్చాలని ఆదేశించడంతో రూ.85 లక్షలు వెచ్చించి 12 ఆధునిక దుకాణాలను ఏర్పాటు చేశారు. నిరాదరణకు గురైన ఈ ప్రాంతాన్ని ఆహార విక్రయశాలల కేంద్రంగా తీర్చిదిద్దారు. చక్కటి ఫుడ్ జోన్గా మార్చిన జీహెచ్ఎంసీ అధికారులను మంత్రి కేటీఆర్ గురువారం ట్విట్టర్లో అభినందించారు.
సిటీబ్యూరో, ఆగస్టు 11 (నమస్తే తెలంగాణ): మల్లేపల్లి ఐటీఐ రోడ్డు. ఈ పేరు వినగానే టక్కున గుర్తుకు వచ్చేది పడకేసిన పారిశుధ్యం, మురుగునీరు, వీధికుక్కలు, పశువుల సంచారం. అటుగా వెళ్లాలంటేనే ప్రజలు, వాహనదారులు జంకాల్సిన పరిస్థితి. కానీ గతేడాది ఏప్రిల్లో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి పారిశుధ్య నిర్వహణపై నిర్వహించిన అకస్మిక తనిఖీల్లో మల్లేపల్లి ఐటీఐ రోడ్డులో విచ్చలవిడిగా ఉన్న చెత్తను చూసి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే ఈ రహదారి రూపురేఖలు మార్చాలని ఆదేశించారు. మేయర్ ఆదేశాల మేరకు రంగురంగుల విద్యుత్దీపాలు, వీధి లైట్లతో ప్రత్యేకంగా స్ట్రీట్ వెడ్డింగ్ ఫుడ్ జోన్ను ఏర్పాటు చేశారు. ఒకప్పుడు అటుగా వెళ్లే వారు శ్వాస తీసుకోవాలంటే కష్టమయ్యే పరిస్థితుల నుంచి రుచికరమైన వంటకాలకు చిరునామాగా ఈ రోడ్డు మారింది.
ఏడాది కిందట మల్లేపల్లి రోడ్డుపై పేరుకుపోయిన చెత్తను పరిశీలించి అధికారులతో మాట్లాడుతున్న మేయర్ విజయలక్ష్మి
మల్లేపల్లి రోడ్డులో ఏర్పాటైన కాఫీ షాప్
జీహెచ్ఎంసీ పరిధిలో రెండవ ఫుడ్ జోన్
జీహెచ్ఎంసీ పరిధిలోనే మల్లేపల్లిలో రెండో ఫుడ్ జోన్ ఏర్పాటైంది. ఇప్పటికే శిల్పారామం ఎదుట ఎదురుగా స్ట్రీట్ ఫుడ్ వెడ్డింగ్ జోన్ను ఏర్పాటు చేయగా, తాజాగా మల్లేపల్లిలో డంపింగ్ యార్డులా మారిన రోడ్డును చక్కదిద్ది, కాలిబాటపై రూ.85 లక్షలు వెచ్చించి 12 దుకాణాలను ఏర్పాటు చేశారు. వాటిని వేలం ద్వారా లబ్ధిదారులకు కేటాయించారు. ఇప్పటికే సగం దుకాణాలు తెరచుకున్నాయి. రోడ్డు ఆక్రమణకు గురికాకుండా, కాలిబాటను పూర్తిగా మూసివేయకుండా దుకాణాలను నిర్మించినట్లు అధికారులు పేర్కొన్నారు. ఆహార విక్రయ జోన్గా మార్చిన జీహెచ్ఎంసీ అధికారులను మంత్రి కేటీఆర్ గురువారం ట్విట్టర్ వేదికగా అభినందించారు.