సిటీబ్యూరో, జూలై 15 (నమస్తే తెలంగాణ): డ్రగ్స్ విక్రయిస్తున్న నిందితులను రంగారెడ్డి జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి రూ. 10లక్షల విలువజేసే 2.50 కిలోల హషీష్ ఆయిల్, 650గ్రాముల చరాస్, 1.5 కిలోల గంజాయితో పాటు స్కూటీ వాహనం, ల్యాప్టాప్, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఖరీదైన హషీష్ ఆయిల్ను ఇంత పెద్ద మొత్తంలో పట్టుకోవడం ఇదే తొలిసారి. రంగారెడ్డి జిల్లా ఆబ్కారీ ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ కమిషనర్ ఎ.చంద్రయ్య కథనం ప్రకారం.. ఎస్.అభిషేక్, వంశీకృష్ణ, జూపల్లి నగేశ్ కలిసి మాదాపూర్, హైటెక్ సిటీ, గచ్చిబౌలితో పాటు నగరంలోని ఇతర ప్రాంతాల్లో గుట్టుచప్పుడు కాకుండా గంజాయి, హషీష్ ఆయిల్(గంజాయి నుంచి తీసిన నూనె), చరాస్ తదితర మత్తు పదార్థాలు విక్రయిస్తున్నారు.
ఈ మేరకు సమాచారం అందుకున్న ఆబ్కారీ అధికారులు మాదాపూర్, గాయత్రి హిల్స్ ప్రాంతంలో మాటువేసి డ్రగ్స్ విక్రయాలకు పాల్పడుతున్న నిందితులను పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రూ.10లక్షల విలువజేసే మత్తు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ నిమిత్తం కేసును శేరిలింగంపల్లి ఎక్సైజ్ అధికారులకు అప్పగించారు. ఏఈఎస్ పవన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ దాడుల్లో ఇన్స్పెక్టర్లు కె.శ్రీనివాస్, లక్ష్మీనారాయణ, కానిస్టేబుళ్లు ప్రవీణ్కుమార్గౌడ్, గోవర్ధన్, శ్రీనివాస్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.