తొలుత స్టైల్ కోసమని..డ్రగ్స్
ఆ తర్వాత బానిసలుగా మారి..
విక్రేతలుగా.. ట్రాన్స్పోర్టర్స్గా అవతారం
అలవాటు మానుకోకపోతే.. జీవితం అంధకారమే..
డ్రగ్స్ రహిత నగరంగా తీర్చిదిద్దడమే
లక్ష్యమంటున్న పోలీసులు
డ్రగ్స్కు అలవాటు పడ్డవారు మొదట్లో ైస్టెల్ కోసం తీసుకునే వారే ఉంటున్నారు. ఆ తరువాత అప్పుడప్పుడు దానిని టేస్ట్ చేస్తూ.. నెమ్మదిగా అలవాటు చేసుకుంటున్నారు. ఇందులో కొందరు మధ్యలోనే మానుకొని బయటపడుతున్నా.. మరికొందరు మాత్రం మత్తు ఊబిలో చిక్కి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఇలాంటి వారు కొత్తవారికి డ్రగ్స్ అలవాటు చేస్తూ, విక్రేతలుగా కూడా మారుతున్నారు. మాదకద్రవ్యాలు అమ్మేవారితో ఉండే పరిచయాలతో వారి నుంచి భారీ మొత్తంలో సరుకును కొని.. ఎక్కువ ధరకు తన తోటి వాళ్లకే అమ్మేస్తున్నారు. ఇలాంటి వారిలో కొందరు ప్రధాన డ్రగ్స్ విక్రేతలతో చేతులు కలుపుతున్నారు. ఈ చైన్ను తెగొట్టేందుకు హైదరాబాద్ నార్కొటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ నిరంతరం ప్రయత్నిస్తున్నది. పట్టుబడ్డ వారికి కౌన్సెలింగ్ ఇప్పించడంతో పాటు వారిని మాదకద్రవ్యాల నుంచి దూరంగా ఉంచేందుకు, వారి కుటుంబ సభ్యులతోనూ మాట్లాడుతున్నారు. ఈ చర్యలతో చాలా మందిలో మార్పు వస్తున్నది.
సిటీబ్యూరో, జూలై 13 (నమస్తే తెలంగాణ) : చదువుకుంటున్న సమయంలో కొందరు సిగరెట్ను సరదా కోసం తాగి.. నెమ్మదిగా అలవాటుపడేవారు.. ఇప్పుడు కాలం మారింది.. ప్రస్తుతం డ్రగ్స్ను ైస్టెల్ కోసమని తీసుకుంటూ.. దానికి బానిసలవుతున్నారు. విలువైన జీవితాన్ని పాడుచేసుకుంటున్నారు. అందుకే సమాజానికి చీడలా పట్టిన మత్తుకు దూరంగా ఉండాలని..నిండైన జీవితాన్ని అంధకారంలోకి నెట్టుకోవద్దని పోలీసులు యువత, విద్యార్థులకు సూచిస్తున్నారు.
14 మంది విద్యార్థులే..
హెచ్న్యూ ఇటీవల ఐదుగురు డ్రగ్స్ విక్రేతలను, 16 మంది వినియోగదారులను గుర్తించి, అందులో 8 మందిని అరెస్ట్ చేసింది. అయితే వినియోగదారుల్లో 14 మంది విద్యార్థులే ఉండటం గమనార్హం. ఇటీవల రంగారెడ్డి జిల్లా ఎక్సైజ్ పోలీసులు భారీ ఎత్తున్న గంజాయిని పట్టుకున్నారు. ఏపీ, ఒడిశా సరిహద్దు నుంచి నగరం మీదుగా మహారాష్ట్రకు రవాణా చేస్తున్న ఈ ముఠాలో అందరూ ఇంజినీరింగ్ విద్యార్థులే. ముందుగా గంజాయి అలవాటు చేసుకొని, ఆ తర్వాత విక్రేతలుగా, స్మగ్లర్లు, రవాణదారులుగా మారారు. ఈ గ్యాంగ్లో ఒకరిద్దరూ గతంలో పోలీసులకు పట్టుబడ్డా, తిరిగి అదే వృత్తిని కొనసాగిస్తున్నారు.
జీవితం చీకటి మయం
సరదా కోసం అలవాటు చేసుకొని డ్రగ్స్కు బానిసలుగా మారే వారు తమ విలువైన జీవితాన్ని చీకటిలోకి నెట్టుకుంటున్నట్లేనని పోలీసులు పేర్కొంటున్నారు. డ్రగ్స్ వినియోగిస్తూ పట్టుబడుతున్న వారిపై నమోదయ్యే కేసులతో భవిష్యత్లో పాస్పోర్టు నుంచి, ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాలు సాధించలేని పరిస్థితి ఎదురవుతుందని హెచ్చరిస్తున్నారు. డ్రగ్స్ రహిత నగరంగా హైదరాబాద్ను తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరుతున్నారు.