సిటీబ్యూరో, జనవరి 19 (నమస్తే తెలంగాణ): రాజస్థాన్ నుంచి హైదరాబాద్కు ప్రైవేట్ బస్సులో దుస్తుల చాటున మాదకద్రవ్యాలను రవాణా చేస్తూ, నగరంలో విక్రయించేందుకు ప్రయత్నిస్తున్న అంతర్రాష్ట్ర డ్రగ్స్ ముఠాను ఎల్బీనగర్ ఎస్వోటీ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి కోటి రూపాయల విలువైన సరుకును స్వాధీనం చేసుకున్నారు. నేరెడ్మెట్లోని రాచకొండ కమిషనరేట్ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీపీ సుధీర్బాబు వివరాలను వెల్లడించారు.
రాజస్థాన్కు చెందిన నరేంద్ర బిష్ణోయ్, ప్రవీణ్ బిష్ణోయ్ జీవనోపాధి కోసం హైదరాబాద్కు వచ్చి, మీర్పేట్లోని నందిహిల్స్ ప్రాంతంలో నివాసముంటూ స్టీల్ రేయిలింగ్ పనులు చేస్తున్నారు. ఈ ఇద్దరు డ్రగ్స్కు అలవాటు పడ్డారు. రాజస్థాన్ నుంచి డ్రగ్స్ను తెచ్చి.. వారు కూడా వాడుకుంటూనే ఇతరులకు విక్రయిస్తున్నారు. ఈ క్రమంలో మీర్పేట్ ప్రాంతంలో నివాసముండే రాజస్థాన్కు చెందిన మరో ఇద్దరు హేమ రామ్, పక్కారామ్ దేవసి అలియాస్ ప్రకాశ్ కూడా వీరితో జత కట్టాడు. వీళ్లంతా డ్రగ్స్కు అలవాటుపడ్డారు.
రాజస్థాన్లో హెరాయిన్ రూ. 5 వేల నుంచి రూ. 6 వేలు, ఎండీఎంఏ రూ. 2 వేల నుంచి రూ. 4 వేలకు గ్రాము చొప్పున కొని వీటిని హైదరాబాద్లో రూ. 10 వేల నుంచి రూ. 12 వేల చొప్పున అమ్మాలని ప్లాన్ వేశారు. ఇందులో భాగంగా రాజస్థాన్కు వెళ్లి ప్రధాన డ్రగ్స్ విక్రేతలను కలిసి 150.3 గ్రాముల హెరాయిన్, 32.1 గ్రాముల ఎండీఎంఏను కొని దుస్తుల్లో పెట్టి.. ప్రైవేట్ బస్సులో నగరానికి తెచ్చారు. వీటిని సిటీలో విక్రయించేందుకు ప్రయత్నిస్తుండడంతో విశ్వసనీయ సమాచారం అందుకున్న ఎల్బీనగర్ ఎస్వోటీ ఇన్స్పెక్టర్ సుధాకర్ బృందం రాజస్థాన్కు చెందిన నలుగురిని పట్టుకుంది. వారి నుంచి 150.3 గ్రాముల హెరాయిన్, 32.1 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్తో పాటు రెండు ద్విచక్రవాహనాలు, ఆరు మొబైల్స్, రూ. 2500 నగదును స్వాధీనం చేసుకున్నారు.