Drugs | సిటీబ్యూరో, డిసెంబర్ 20(నమస్తే తెలంగాణ): డ్రగ్ సఫ్లయర్స్ తమ వ్యాపారాన్ని హైదరాబాద్లో నిర్వహించేందుకు కొత్త దారులు ఎంచుకుంటున్నారు. నూతన సంవత్సర వేడుకులు దగ్గర పడుతుండటంతో ముంబై, గోవా, బెంగళూర్ నుంచి డ్రగ్స్ హైదరాబాద్కు సరఫరా చేసేందుకు డ్రగ్స్ స్మగ్లర్లు వివిధ రకాలుగా ప్రయత్నిస్తుండగా, వాటిని కస్టమర్లకు విక్రయించి లాభాలు పొందేందుకు డ్రగ్స్ పెడ్లర్స్ యత్నిస్తున్నారు. తాజాగా ఎల్జీబీటీక్యూ (లెస్బియాన్స్, గే, బైసెక్స్వల్, ట్రాన్స్జెండర్, ఖ్విర్) కమ్యూనిటీని టార్గెట్ చేస్తూ డ్రగ్స్ విక్రయించేందుకు ప్రయత్నిస్తూ ఓ డ్రగ్స్ పెడ్లర్ పోలీసులకు పట్టుబడ్డాడు. దీంతో ఈ విషయంపై వెలుగులోకి వచ్చింది.
ఈ కమ్యూనిటీకి డ్రగ్ విక్రయం ఎవరికి అనుమానం రాదనే భావనతో డ్రగ్ పెడ్లర్స్ కొత్త రూట్లలో హైదరాబాద్లో డ్రగ్స్ దందా నిర్వహిస్తున్నారు. ఆయా గ్రూప్లలో కొందరిని పరిచయం చేసుకుంటూ ఆ కమ్యూనిటీకి ఈ డ్రగ్ పెడ్లర్స్ దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. సాధారణ ప్రజలకు డ్రగ్స్ విక్రయించాలంటే పబ్లు, బార్లు, వివిధ రకాలైన ఈవెంట్స్ జరిగే సమయంలో అక్కడికి వచ్చే వారిని పరిచయం చేసుకుంటూ తమ వద్ద ఉన్న డ్రగ్స్ విక్రయించాలి. పరిచయం ఉన్న వారి ద్వారా కొత్తవారికి విక్రయిస్తుంటారు. డ్రగ్ విక్రయాలపై దేశ వ్యాప్తంగా పోలీసుల నిఘా పెరిగింది. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా పోలీసులు నిఘా పెంచారు.
నూతన సంవత్సరం వేడుకల సందర్భంగా ఎల్జీబీటీక్యూ కమ్యూనిటీ చేసుకోవడానికి వేడుకలు నిర్వహించుకుంటారు. ఆయా వేడుకల్లో డ్రగ్స్ పార్టీలు కూడా జరిగే అవకాశాలుంటాయి. ఈ విషయాలపై పోలీసులు అంతగా ఫోకస్ చేయరు. దీంతో డ్రగ్స్ విక్రయానికి అనువైన ప్రాంతంగా డ్రగ్స్ పెడ్లర్స్ భావిస్తూ ఆ మేరకు తమ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ముంబై, గోవా, బెంగళూర్ వంటి ప్రాంతాల్లో ఉండే ఈ గ్రూప్లకు డ్రగ్స్ సరఫరా చేసే ముఠాలు తాజాగా హైదరాబాద్లో ఉండే ముఠాలకు కూడా ఈ ప్లాన్లు వివరిస్తున్నట్లు సమాచారం. ఈ గ్రూప్లు ఒక్కొక్కటి ప్రత్యేక గ్రూప్లుగా ఉండటం, కొన్ని కలిసి ఉండటం, మొత్తం ఒక గ్రూప్గా ఉంటూ సమాచారాన్ని మార్పిడి చేసుకుంటుంటారు.
న్యూ ఇయర్ వేడుకలకు సంబంధించిన డ్రగ్స్ కావాలంటే ఇప్పటి నుంచి ప్రణాళికలతో ముందుకు సాగాలని ఇరు వర్గాలు భావిస్తుంటాయి. ఇంకా ఒకటి రెండు రోజులు అయ్యిందంటే పోలీసుల నిఘా మరింతగా పెరుగుతుందనే భావన వారిలో ఉన్నది. తాజాగా టీన్యాబ్, నాంపల్లి పోలీసులు ఎండీఎంఏ డ్రగ్స్ను ముంబై నుంచి తెచ్చి ఎల్జీబీటీక్యూ కమ్యూనిటీకి విక్రయించేందుకు ప్రయత్నిస్తూ అమీర్ అనే వ్యక్తి పట్టుబడ్డాడు. ఈ కేసును లోతైన దర్యాప్తు జరిపితే ఈ వ్యవహారంలో మరింత సమాచారం వస్తుందని పోలీసులు భావిస్తున్నారు.