విభిన్న రంగాలకు డ్రోన్ టెక్నాలజీ సేవలు
హైదరాబాద్ కేంద్రంగా డ్రోన్ టెక్నాలజీలో కార్యకలాపాలు
ఔత్సాహికులను ప్రోత్సహిస్తున్న తెలంగాణ ప్రభుత్వం
సిటీబ్యూరో, మే 29 (నమస్తే తెలంగాణ): డ్రోన్ టెక్నాలజీకి ప్రాధాన్యత పెరుగుతోంది. ఏ ఒక్క పనికో పరిమితం కావడం లేదు. ఫొటోగ్రఫీతో మొదలైన ప్రయాణం అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతూ విభిన్న రంగాలకు అత్యవసరంగా మారింది. డ్రోన్లను వైద్య, వ్యవసాయ రంగం, పోలీసు శాఖ, భూముల సర్వే, ఫొటోగ్రఫీ, మైనింగ్, రోడ్ల నిర్మాణంలోనూ ప్రభుత్వ శాఖలు విసృత్తంగా వినియోగిస్తున్నారు. భవిష్యత్ మరింత ఆశాజనకంగా ఉండడంతో యువతరం డ్రోన్ టెక్నాలజీపై ఎక్కువగా దృష్టి సారిస్తోంది. కొందరు ఔత్సాహికులు డ్రోన్ సేవలను అందించేందుకు స్టార్టప్లను ప్రారంభించేందుకు ఆసక్తి చూపుతుండగా, ప్రైవేటు సంస్థలు ఒక వ్యాపార వస్తువుగా డ్రోన్ టెక్నాలజీని గుర్తించి ప్రత్యేక సంస్థలను ఏర్పాటు చేస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా డ్రోన్ ప్రేమ్ వర్క్ను రూపొందించి అమలు చేస్తోంది. ఇలా డ్రోన్ టెక్నాలజీని విస్తృతంగా వాడడంతో తెలంగాణ ప్రభుత్వం చూపుతున్నంత చొరవ దేశంలోమరే ప్రభుత్వం చూపడంలేదనే అభిప్రాయాన్ని నిపుణులు వ్యక్తం చేస్తున్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రోత్సాహం..
డ్రోన్ టెక్నాలజీని ప్రోత్సహించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పోటాపోటీగా పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం డ్రోన్ల కోసమే ప్రత్యేకంగా పాలసీని తీసుకువచ్చి, ఆ రంగాన్ని ప్రోత్సహించేందుకు చర్యలు చేపట్టింది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో ఈ నెల 27, 28 తేదీల్లో భారత్ డ్రోన్ మహోత్సవ్ నిర్వహించింది. దేశ వ్యాప్తంగా స్టార్టప్లు, కంపెనీల నుంచి డ్రోన్ల ద్వారా ఎలాంటి సేవలు, ఏయే రంగాలకు అందించవచ్చో ప్రత్యేకంగా ప్రదర్శన ద్వారా తెలుసుకునేందుకు శ్రీకారం చుట్టింది. డ్రోన్లతో గత కొన్నేళ్లుగా తెలంగాణలో చేపట్టిన ప్రయోగాత్మక కార్యక్రమాలను ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా పాల్గొన్న భారత్ డ్రోన్ మహోత్సవ్లో వివరించినట్లు హైదరాబాద్ కేంద్రంగా డ్రోన్ స్టార్టప్ను నిర్వహిస్తున్న ప్రేమ్ కుమార్ తెలిపారు.
రాష్ట్రంలో డ్రోన్ అకాడమీలు..
దేశ వ్యాప్తంగా పది వరకు డ్రోన్ అకాడమీలు ఉంటే అందులో రెండు డ్రోన్ అకాడమీలు రాష్ట్రంలోనే ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోనే తెలంగాణ స్టేట్ ఏవియేషన్ అకాడమీ(డ్రోన్ అకాడమీ) ఉండగా, మరొకటి ఫ్లైటెక్ ఏవియేషన్ను ప్రైవేటు సంస్థ నిర్వహిస్తోంది. డ్రోన్ల నిర్వహణకు ప్రత్యేకంగా కోర్సులను నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనుషుల రవాణా తప్ప, వివిధ రంగాలలో మనుషులు చేసే పనిని డ్రోన్లతో చేయిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే డ్రోన్ల నిర్వహణలో నైపుణ్యం కలిగిన, శిక్షణ పొందిన అభ్యర్థులను అందించేందుకు తెలంగాణ ప్రభుత్వ పరిధిలోని తెలంగాణ స్టేట్ ఏవియేషన్ అకాడమీ ఆధ్వర్యంలో డ్రోన్ అకాడమీని ఏర్పాటు చేసింది. విమానాలు నడిపే పైలెట్లకు డీజీసీఏ నిబంధనల ప్రకారం ఏవిధంగా శిక్షణనిస్తారో అదే తరహాలో డ్రోన్లను ఎగరవేయడం, ఆ తర్వాత వాటి నిర్వహణలోనూ శిక్షణనిస్తున్నారు.
ప్రస్తుతం డ్రోన్స్ వినియోగం ఇలా..