సిటీబ్యూరో, ఆగస్టు 27(నమస్తే తెలంగాణ): పాతబస్తీ మెట్రో రైలు సన్నాహాక పనులను వేగవంతం చేయాలని సీఎం కేసీఆర్ ఇచ్చిన ఆదేశాలతో మెట్రో రైలు అలైన్మెంట్, ప్రభావిత ఆస్తులపై డ్రోన్ సర్వేను ప్రారంభించామని హైదరాబాద్ మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. సంప్రదాయ సర్వేతో పాటు దారుల్ షిఫా జంక్షన్ నుంచి శాలిబండ జంక్షన్ మధ్య ఇరుకైన మార్గంలో రహదారి విస్తరణ, మెట్రో స్టేషన్ల నిర్మాణానికి అవసరమైన ప్రభావిత ఆస్తులకు చెందిన కచ్ఛితమైన కొలతలు తీసుకోవడానికి డ్రోన్ సర్వే ప్రారంభించామన్నారు. ఈ సర్వేలో 21 మసీదులు, 12 దేవాలయాలు, 12 ఆషూర్ఖానాలు, 33 దర్గాలు, 7 సమాధి యార్డులు, 6 చిల్లాలు సహా దాదాపు 103 మత పరమైన, ఇతర సున్నితమైన నిర్మాణాల రక్షణ అంశం మెట్రో నిర్మాణానికి ప్రధాన సవాలుగా ఉంది. మతపరమైన ఇతర సున్నితమైన నిర్మాణాలను రక్షించడానికి తగిన ఇంజనీరింగ్ పరిష్కారాలను రూపొందించడంలో డ్రోన్ సర్వే సహాయపడుతున్నదన్నారు. మెట్రో అలైన్మెంట్, ఫిల్లర్ లోకేషన్లు నిర్మాణాలపై ఎటువంటి ప్రతికూల ప్రభావం చూపని విధంగా ప్లాన్ చేస్తున్నట్లు ఆయన వివరించారు. డ్రోన్ సర్వే ద్వారా రియల్ టైమ్ డేటా, హై రిసోల్యూషన్ ఇమేజరీ 3డీ మోడలింగ్, జీఐఎస్ (జియో గ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్) డేటా, క్యాడ్ సాఫ్ట్వేర్ ఏకీకరణ, డేటా విశ్లేషణ, విజువలైజేషన్లను త్వరితగతిన సేకరించవచ్చని మెట్రో ఎండీ తెలిపారు. అదే సమయలో రాబోయే కొద్ది రోజులో భూసామర్థ్య పరీక్షలు ప్రారంభించడానికి టెండర్లు సైతం ఖరారు చేస్తున్నామని తెలిపారు. ఫలక్నుమా మెట్రో స్టేషన్ ఉన్న ఫలక్నుమా వైపు నుంచి భూసామర్థ్య పరీక్షలు ప్రారంభమవుతాయని, ఇప్పటికే ఉన్న ఎంజీబీఎస్ కాకుండా పాత నగరంలో 5.5 కి.మీ మెట్రో మార్గంలో సాలార్జంగ్ మ్యూజియం, చార్మినార్ మెట్రో స్టేషన్లు ఈ రెండు చారిత్రాత్మక మందిరాలకు 500 మీటర్ల దూరంలో ఉంటాయని తెలిపారు.