శేరిలింగంపల్లి, మార్చి 1: మద్యం మత్తులో కారును వేగంగా, నిర్లక్ష్యంగా నడిపించడమే కాకుండా మరో కారును ఢీకొట్టి, ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ ప్రాణాలకు ప్రమాదం కలిగేలా డ్రైవింగ్ చేసిన యువకుడిని గచ్చిబౌలి పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం నార్సింగిలోని జయభేరి ది సమ్మిట్లో నివాసం ఉంటున్న గుర్రంపాటి తరుణ్(24) ఆదివారం మధ్యాహ్నం 12:30 గంటల ప్రాంతంలో మద్యం మత్తులో తన బెంజ్ కారులో నార్సింగి నుంచి కూకట్పల్లి వైపు వెళ్తూ మార్గమధ్యలో నానక్రాంగూడ వద్ద రాహుల్ కామరాజు అనే వ్యక్తి కారును వెనుక నుంచి ఢీకొట్టాడు.
దీంతో రాహుల్ తన వాహనంపై నియంత్రణ కోల్పోయి డివైడర్ను ఢీకొట్టాడు. అదే సమయంలో అక్కడే విధుల్లో ఉన్న హోం గార్డు వైర్లెస్ సందేశం ద్వారా కంట్రోల్ రూమ్ అధికారులకు సమాచారం అందించారు. అనంతరం గచ్చిబౌలి ట్రిపుల్ ఐటీ జంక్షన్ వద్ద వైర్లెస్ సందేశం అందుకున్న గచ్చిబౌలి ట్రాఫిక్ పోలీస్స్టేషన్కు చెందిన కానిస్టేబుల్ నర్సింహులు తరుణ్ కారును గమనించి ఆపాల్సిందిగా సంకేతం ఇచ్చారు. తరుణ్ కారు వేగాన్ని కాస్త తగ్గించి మళ్లీ వెంటనే వేగాన్ని పెంచి కారును ముందుకు పోనిచ్చాడు.
అక్కడే దారిలో ఉన్న నర్సింహులు కారు బానెట్పై పడిపోయాడు. అయినప్పటికీ తరుణ్ పట్టించుకోకుండా కారును వేగంగా నడిపిస్తూ ముందుకు సాగాడు. వాహనదారులు అప్రమత్తమై తరుణ్ కారును ఆపడంతో అతను పోలీసులకు చిక్కాడు. వారు అతనికి డ్రంకెన్ డ్రైవింగ్ పరీక్ష నిర్వహించగా అందులో పాజిటివ్గా తేలింది. నిందితుడు మోతాదుకు మించి మద్యం సేవించి వాహనం నడిపించడమే కాకుండా ఇతరుల ప్రాణాలకు ముప్పు కలిగించే విధంగా వ్యవహరించాడని పోలీసులు అతనిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. అతని బెంజ్ కారును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.