బడంగ్పేట, డిసెంబర్ 11: ప్రతి ఇంటికి తాగునీరు అందించాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్ ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న కాలనీలకు రూ. 1200 కోట్లు మంజూరు చేశారని విద్యాశాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్లో శనివారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ ఔటర్ రింగ్రోడ్డు లోపల ఉన్న కాలనీలతో పాటు కేవలం మహేశ్వరం నియోజకవర్గం పరిధిలో రూ. 210 కోట్లు నిధులు కేటాయించారన్నారు. మహేశ్వరం నియోజకవర్గంలో అల్మాస్గూడలో-2, గుర్రంగూడ, నాదర్గూల్, బడంగ్పేట, ప్రశాంతి హిల్స్, నందిహిల్స్, బీరప్పకాలనీ, దేవతలగుట్ట, మామాడిపల్లి, షాహీన్నగర్, పహాడీషరీఫ్, తుక్కగూడలలో ఒక్కొక్కటి చొప్పున మొత్తం 13 రిజర్వాయర్లను ఏర్పాటు చేయబోతున్నామన్నారు. 550 కిలోమీటర్ల వరకు తాగునీటి పైపులైన్లు ఏర్పాటు చేయిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. పైపులైన్లతో పాటు రోడ్ల విస్తరణకు కూడా రూ. 20 కోట్ల నిధు లు మంజూరు చేశారని తెలిపారు. ఇన్ని నిధులు కేటాయించిన సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మీర్పేట మేయర్ దుర్గా దీప్లాల్, డిఫ్యూటీ మేయర్ తీగల విక్రమ్రెడ్డి, క మిషనర్ నాగేశ్వర్, కార్పొరేటర్లు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.