డివిజన్ అభివృద్ధికి నిధులు మంజూరు
త్వరలో పనులు ప్రారంభం
దుర్గానగర్ పర్యటనలో ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్
మైలార్దేవ్పల్లి, ఏప్రిల్ 16 : వచ్చే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని ముంపు ఉన్న ప్రాంతాల్లో ముంపు నివారణకు జీహెచ్ఎంసీ డ్రైన్ బాక్స్ నిర్మాణాలు చేపడుతుందని ఎమ్మెల్యే టి.ప్రకాశ్గౌడ్ పేర్కొన్నారు. శనివారం మైలార్దేవ్పల్లి డివిజన్ పరిధిలోని దుర్గానగర్ ప్రాంతంలో జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి పర్యటించి అక్కడి సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. వర్షం వచ్చినప్పుడు దుర్గానగర్ సిగ్నల్ నుంచి బాలాజీ మంగళం దాబా వెనుక భాగంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సరిగా లేకపోవడంతో వర్షాకాలంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని స్థానికులు ఎమ్మెల్యేకు వివరించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దుర్గానగర్ ప్రాంతంలోని చుట్టూ ఉన్న ప్రాంతానికి రూ.13.50 కోట్లతో బాక్స్ డ్రైన్ మంజూరైందని తెలిపారు. దుర్గానగర్ నుంచి దుర్గా కన్వెన్షన్ వరకు 600 మీటర్లతో అండర్ గ్రౌండ్ డ్రైన్, లక్ష్మీగూడ నుంచి 360 మీటర్లతో పల్లెచెరువు వరకు ఓపెన్ డ్రైన్ మంజూరు చేయించినట్లు ఎమ్మెల్యే ప్రజలకు తెలిపారు. టెండర్ ప్రక్రియ పూర్తి కాగానే పనులు మొదలవుతాయన్నారు. పారిశుధ్యం, స్ట్రీట్ లైట్ల సమస్యలను పరిష్కరించాలని జీహెచ్ఎంసీ అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ ఈఈ నరేందర్గౌడ్, జలమండలి జీఎం చంద్రశేఖర్, జీహెచ్ఎంసీ ప్రాజెక్ట్ డీఈ, ఏఈ బల్వంత్, స్ట్రీట్ లైట్స్ డీఈ రామారావు, డివిజన్ అధ్యక్షుడు ప్రేమ్గౌడ్, రఘుయాదవ్ తదితరులు పాల్గొన్నారు.
సీఎం సహాయనిధి నిరుపేదలకు వరం..
బండ్లగూడ, ఏప్రిల్ 16 : నిరు పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి వరంలా మారిందని, దాని ద్వారా ఎంతో మేలు జరుగుతుందని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ అన్నారు. బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కిస్మత్పూర్, హిమాయత్సాగర్ ప్రాంతానికి చెందిన పలువురు బాధితులు ఇటీవల ఆర్థిక సాయం కోసం ముఖ్యమంత్రి సహాయ నిధికి టీఆర్ఎస్ అధ్యక్షుడు సురేశ్గౌడ్ ఆధ్వర్యంలో దరఖాస్తు చేసుకున్నారు. ఈ మేరకు కిస్మత్పూర్ గ్రామానికి చెందిన భాస్కర్రెడ్డికి రూ.60వేలు, అరవింద్కు రూ.32వేలు, పవన్కుమార్రెడ్డి రూ.20 వేలు, హిమాయత్సాగర్కు చెందిన అరుణకు రూ.52వేలు మంజూరైన చెక్కులను ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ శనివారం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఖాజా, చేగూరి రాజు, సంపత్కుమార్, అరవింద్, ప్రవీణ్గౌడ్, శ్రీనాథ్, మహేశ్, జగదీశ్ తదితరులు పాల్గొన్నారు.