సుల్తాన్బజార్, మార్చి 15 : ఉస్మానియా మెడికల్ కళాశాలలో ఆధునిక స్కిల్ ల్యాబ్ను ప్రారంభించడం అభినందనీయమని తెలంగాణ వైద్య విద్య సంచాలకు లు డాక్టర్ రమేశ్రెడ్డి పేర్కొన్నారు. బుధవారం కోఠిలోని ఉస్మానియా మెడికల్ కళాశాలలో ఆధునిక స్కిల్ ల్యాబ్ను ఆయన ఉస్మాని యా మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ శశికళారెడ్డి, ఉస్మానియా దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ బి. నాగేందర్, ఆరోగ్య, కు టుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ రీజినల్ డైరెక్టర్ డాక్టర్ అనురాధ మేడోజు, అనస్థీషియా విభాగం అధిపతి, స్కిల్ ల్యాబ్ నోడల్ ఆఫీసర్ డాక్టర్ పాండు నాయక్తో కలిసి లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఉస్మానియా మెడికల్ కళాశాల చరిత్రలో స్కిల్ ల్యాబ్ ఒక మైలురాయి అని అభివర్ణించారు.
తాను వైద్య విద్యను అభ్యసించే సమయంలో అత్యధికంగా క్యాజువాల్టీలలోనే శిక్షణ పొందామని అన్నారు. స్కిల్ ల్యాబ్లో శిక్షణ పొందేవారు సర్టిఫికెట్ కోసం కాకుండా నైపుణ్యాలను మెరుగుపర్చుకోవాలని అన్నారు. చివరి సంవత్సరం పూర్తి చేసి ఇంటర్న్షిప్కి వెళ్లడానికి సిద్ధంగా ఉండాలని సూచించారు. ట్రామా నిర్వహణ, క్రిటికల్ కేర్ నైపుణ్యాలను సంబంధిత విభాగాలు విద్యార్థులకు శిక్షణ ఇచ్చే విధంగా రూపొందించాలని అన్నారు. సీపీఆర్ సామూహిక శిక్షణను తెలంగాణ ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుందని అన్నారు. కార్డియోపల్మనరీ రిససిటేషన్ కార్యక్రమం సాధారణ ప్రజల కోసం క్రమం తప్పకుండా నిర్వహిస్తామని అన్నారు.
ఉస్మానియా మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ శశికళారెడ్డి మాట్లాడుతూ శిక్షణ పొందుతున్న వైద్య విద్యార్థులకు ఈ కేంద్రం నుంచి జాతీయ గుర్తింపు పొందిన శిక్షణ సర్టిఫికెట్ను అందజేస్తామని అన్నారు. ఈ సర్టిఫికెట్ ప్రతి భారతీయ వైద్య గ్రాడ్యుయేట్కు తప్పనిసరి అన్నారు. నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాల, గాంధీ వైద్య కళాశాల, గుంటూరు మెడికల్ కళాశాల, కాకతీయ మెడికల్ కళాశాలలకు చెందిన ట్రైనీ మెడికల్, సర్జికల్, పీడియాట్రిక్, అనస్థీషీయా, ప్రసూతి స్పెషాలిటీ వైద్యుల కోసం మార్చి 13 నుంచి 17 వరకు ఐదు రోజుల శిక్షణా కార్యక్రమాన్ని తొలిసారిగా నిర్వహిస్తున్నామని చెప్పారు.