Hyderabad Metro | సిటీబ్యూరో, జూలై 31 (నమస్తే తెలంగాణ): గ్రేటర్ ప్రజా రవాణా వ్యవస్థలో మరో అద్భుత నిర్మాణం ఆవిష్కృతం కానున్నది. సింగిల్ ఫిల్లర్పై మెట్రో రైలు, రోడ్డు రవాణా వాహనాలు రాకపోకలు సాగించనున్నాయి. హైదరాబాద్ నగరాన్ని విశ్వ నగరంగా తీర్చిదిద్దే చర్యల్లో భాగంగా గ్రేటర్లో డబుల్ డెక్కర్ ఫ్లై ఓవర్లపై ప్రభుత్వం దృష్టి సారించింది. ప్యారడైజ్ నుంచి కండ్లకోయ జంక్షన్ (ఎన్హెచ్-44) వరకు 18.350 కిలోమీటర్లు, జింఖానా గ్రౌండ్ నుంచి తూంకుట వరకు (ఎస్హెచ్-1/రాజీవ్ రహదారి) 18.400 కిలోమీటర్ల వరకు డబుల్ డెక్కర్ ఫ్లై ఓవర్ నిర్మాణానికి డిటెల్డ్ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్)లను సిద్ధం చేశారు. ఈ రెండు నిర్మాణాలకు సంబంధించి భూ సేకరణ ప్రక్రియను సైతం రాడార్ సర్వే ద్వారా పూర్తి చేసి 150.414 ఎకరాల రక్షణ స్థలాలు అవసరమని తేల్చారు. కేంద్రం ఈ రక్షణ స్థలాలను అప్పగిస్తే ఇందుకు బదులుగా 500 ఎకరాలు కేంద్రానికి అప్పగిస్తామని, ప్రజా రవాణాకు సహకరించాలని పలుమార్లు కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఇటీవల కాలంలోనూ మంత్రి కేటీఆర్ రక్షణ శాఖ మంత్రిని కలిసి వినతిపత్రం సమర్పించగా ఇందుకు రక్షణ శాఖ సానుకూలంగా స్పందించింది. ఈ నేపథ్యంలోనే ఈ రెండు చోట్ల స్కైవేల నిర్మాణాలను చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు సోమవారం మంత్రి కేటీఆర్ ప్రకటించారు. దీంతో డబుల్ డెక్కర్ నిర్మాణాలను త్వరలోనే కార్యరూపంలోకి తెచ్చేందుకు ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తున్నది.
నాగాపూర్లో తరహాలో డబుల్ డెక్కర్
నాగాపూర్లో 38.21 కిలోమీటర్ల మేర మెట్రో రైలు ప్రాజెక్టును రూ.8,600కోట్ల అంచనా వ్యయంతో చేపట్టారు. దేశంలోనే వినూత్నంగా ఒకే స్తంభానికి డబుల్ డెక్కర్ ఫ్లై ఓవర్ను నిర్మించారు. ఒక దానిపై మరోటి వస్తుంది. మొదటి ఫ్లై ఓవర్లో వాహనాల రాకపోకలకు, రెండో ఫ్లై ఓవర్లో మెట్రో రైలు ప్రయాణించేలా నిర్మించారు. ఇదే తరహాలో నగరంలో డబుల్ డెక్కర్ నిర్మాణాలు చేపట్టేందుకు హెచ్ఎండీఏ సిద్ధంగా ఉన్నది. కాగా డబుల్ డెక్కర్ ఫ్లై ఓవర్తో బహుళ ప్రయోజనాలు ఉండనున్నాయి. కింద, మధ్యలో రోడ్డు రవాణా, చివరి అంతస్తులో మెట్రో రైలు ఆపరేషన్స్ ఉంటాయి. ప్రధానంగా డబుల్ డెక్కర్ ఫ్లై ఓవర్తో భూమి, ఆస్తుల సేకరణ గణనీయంగా తగ్గనున్నది. ప్రాజెక్టు వ్యయంలో 40శాతం మేర వ్యయం తగ్గుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఒకే స్తంభంపై మెట్రో, రోడ్డు రవాణాతో సుందర దృశ్యం ఆవిష్కృతం కానున్నది. ఎన్హెచ్-44లో భాగంగా నిజామాబాద్ వైపు వెళ్లే ప్రయాణికులంతా ఔటర్ రింగు రోడ్డు సమీపం వరకు వెళ్లడం ఒక ఎత్తయితే.. అక్కడి నుంచి నగరంలోకి చేరుకోవడం కష్టసాధ్యమైన పరిస్థితుల్లో ఈ ప్రాజెక్టు అమలుతో నగరవాసులకు మహా ఉపశమనం లభించనున్నది. ఇదే సమయంలో కరీంనగర్ నుంచి తూంకుంట మీదుగా జేబీఎస్కు చేరుకోవడంలో తలెత్తుతున్న ట్రాఫిక్ జాంకు ఈ డబుల్ డెక్కర్ నిర్మాణంతో శాశ్వత పరిష్కారం లభించనున్నది.