సిటీబ్యూరో, మే 20 (నమస్తే తెలంగాణ) : అర్హులైన స్థానికులకు మాత్రమే డబుల్ బెడ్రూం ఇండ్లను కేటాయించాలని లబ్ధిదారులు అధికారులను కోరారు. సనత్నగర్ నియోజకవర్గ పరిధిలోని పలు ప్రాంతాల్లో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లలో మిగిలిన గృహాలను స్థానికేతరులకు కేటాయిస్తూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీంతో అర్హులైన పలువురు లబ్ధిదారులు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులతో ఫోన్లో మాట్లాడి సమస్యను వివరించారు. ఈ మేరకు హైదరాబాద్ జిల్లా జాయింట్ కలెక్టర్కు లేఖను రాయగా, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గుర్రం పవన్కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో పలువురు నాయకులు, లబ్ధిదారులు జాయింట్ కలెక్టర్ జితేందర్రెడ్డి, పీడీ అశోక్ల దృష్టికి తెచ్చారు.
అర్హులైన వారి దరఖాస్తులు అధికారుల వద్దే పెండింగ్లో ఉండగా, స్థానికేతరులకు ఎలా కేటాయిస్తారని లబ్ధిదారులు అధికారులను ఈ సందర్భంగా ప్రశ్నించారు.తమకు ఇండ్లు కేటాయించకపోవడంతో సంవత్సరాల తరబడి అద్దె ఇండ్లలో ఉంటూ.. ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానికేతరులకు ఇండ్లను కేటాయిస్తే శాంతి భద్రతలకు విఘాతం ఏర్పడే ప్రమాదం ఉందని నాయకులు అధికారులకు వివరించారు. స్థానికేతరులకు కేటాయిస్తూ ఇచ్చిన ఆదేశాలను వెంటనే వెనక్కు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ కుర్మ హేమలత, నాయకులు వెంకటేశ్, లక్ష్మీపతి తదితరులు పాల్గొన్నారు.

Saicharan Colony Adikmet