చౌటుప్పల్, అక్టోబర్ 19 : రాష్ట్రంలోని ప్రతి ఇంటికి సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అందుతున్నాయని హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి అన్నారు. బుధవారం చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధి 16, 20వ వార్డుల్లో మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావుతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నిరంతరం ప్రజల గురించే ఆలోచిస్తారన్నారు. అందుకు నిదర్శనమే నేటి సంక్షేమ పథకాలు అన్నారు.
ఏ ఇంటికి వెళ్లినా తాము కారుగుర్తుకే ఓటేస్తామని స్వచ్ఛందంగా చెప్తున్నారని తెలిపారు. పుట్టిన బిడ్డ మొదలు వృద్ధుల వరకు ఏదో ఒక పథకం ద్వారా లబ్ధిపొందుతున్నారన్నారు. రైతుబంధు, రైతుబీమా, దళితబంధు వంటి పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ మోతే శ్రీలతా రెడ్డి, కార్పొరేటర్లు మన్నె కవితారెడ్డి, వనం సంగీతాయాదవ్, దేదీప్యరావు, మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు, టీటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు మోతే శోభన్రెడ్డి, కార్పొరేటర్లు బన్నాల గీతప్రవీణ్ ముదిరాజ్, మాజీ కార్పొరేటర్లు పద్మావతి, సునరితరెడ్డి, చౌటుప్పల్ మున్సిపల్ చైర్మెన్ రాజు,తదితరులు పాల్గొన్నారు.