బాలానగర్/అల్లాపూర్, సెప్టెంబర్ 9 : కూకట్పల్లి డివిజన్లో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు చేపట్టిన ఇంటింటికీ పాదయాత్ర శనివారం రెండో రోజుకు చేరింది. మహిళలు ఎమ్మెల్యే కృష్ణారావుకు బొట్టుపెట్టి హారతిచ్చి శాలువాలు కప్పి ఘనస్వాగతం పలికారు. సంగీత్నగర్, దయార్గూడ, కోమంగడ్డ, కేరళబస్తీ, దేవినగర్, గాయత్రినగర్ రామయ్యనగర్లో వివిధ విభాగాల అధికారులతో కలిసి ఆయన ఇంటింటికీ వెళ్లి ప్రజలను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పాదయాత్రలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు మేము సైతం అంటూ కూకట్పల్లి డివిజన్ పురోభివృద్ధికి చేపట్టిన పనుల వివరాలను కరపత్రాల ద్వారా ప్రజలకు, పలు వ్యాపార, వాణిజ్య సంస్థలలో అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ కూకట్పల్లి నియోజకవర్గంలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి పనులను చేపడుతు న్నట్లు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహకారంతో నిధులు తెచ్చి ప్రజా అవసరాలకు తగ్గట్టు అభివృద్ధి పనులు చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే రికార్డు స్థాయిలో పనులు చేపట్టి పూర్తి చేసినట్లు చెప్పారు. పెండింగ్లో ఉన్న పనులను సైతం సకాలంలో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. కాలనీలు, బస్తీలలో కమ్యూనిటీహాల్స్ నిర్మాణం, శ్మశానవాటికల అభివృద్ధి పనులు చేపట్టి పూర్తి చేస్తున్నట్లు తెలిపారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కోసం ప్రస్తుతం దరఖాస్తు దారుల పరిశీలన జరుగుతుందని, త్వరలోనే లాటరీ పద్ధతి ద్వారా అర్హులకు ఇండ్లను కేటాయించడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నదన్నారు. అర్హత పొంది డబుల్ ఇండ్లు రాని వారికి రెండోదఫాలో ఇండ్లు ఇచ్చేందుకు కృషి చేయనున్నట్లు చెప్పారు. తెంలగాణ ఆవిర్భావం తర్వాత లోతట్టు ప్రాంతాల్లో ముంపు సమస్యను 90 శాతం పరిష్కరించినట్లు తెలిపారు. కాంగ్రెస్, బీజేపీలను ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎవరెన్ని ఎత్తులు వేసినా గెలుపు గులాబీ పార్టీదేనన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణ, జీహెచ్ఎంసీ, జలమండలి, విద్యుత్, రెవెన్యూ, హెల్త్ డిపార్ట్మెంట్ల అధికారులు, బీఆర్ఎస్ నేతలు, వెల్ఫేర్ అసోసియేషన్ నేతలు, సభ్యులు, ప్రజలు పాల్గొన్నారు.
కాంగ్రెస్, బీజేపీ నాయకుల మాయమాటలను ప్రజలు నమ్మిమోసపోవద్దని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. మాది చేతల ప్రభుత్వం.. చేసేదే చెప్తాం.. ప్రజా అవసరాలను గుర్తించి చెప్పినవి కూడా ఎన్నో చేసిన ఘనత సీఎం కేసీఆర్దే అన్నారు. ఈ రాష్ర్టాన్ని దశాబ్దాలపాటు పాలిచిన కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు ఒరగబెట్టిందేమీలేదని, ప్రజలకు తీరని అన్యాయం చేశారని చెప్పారు. 30వ రోజు శనివారం సాయంత్రం అల్లాపూర్లో వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ఎమ్మెల్యేతోపాటు బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు పాదయాత్ర చేశారు. పద్మావతినగర్, మేరాజ్నగర్, అజీజ్నగర్ తదితర ప్రాంతాల్లో కార్పొరేటర్ సబీహాబేగంతో కలిసి ఎమ్మెల్యే పర్యటించారు. సమస్యలను వింటూ.. పరిష్కరస్తూ.. పాదయాత్ర కొసాగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాలనీల్లో పర్యటించి ఇంటింటికీ వెళ్లి సమస్యలను తెలసుకుంటున్నానన్నారు. సమస్యలను తెలసుకొని ప్రణాళికలకు సిద్ధం చేసి, ప్రతిపాదనలు పంపిస్తున్నామని తెలిపారు. అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు చేరేలా చూస్తామన్నారు. డ్రైనేజీ, రోడ్లు వీధిలైట్లు, తాగునీరు తదితర అంశాలపై ప్రత్యేక దృష్టిసారించామని చెప్పారు. ఇప్పటికే డివిజన్లో 90 శాతం అభివృద్ధి పనులు పూర్తయ్యాయని, పెండింగ్ పనులు త్వరలోనే పూర్తి చేస్తామన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మేడ్చల్ జిల్లా మైనార్టీ మహ్మద్గౌసుద్దీన్, లింగాల ఐలయ్య, వీరారెడ్డి, పిల్లి తిరుపతి, జావెద్, మోయిజ్ తదితరులు పాల్గొన్నారు.