మియాపూర్ , డిసెంబరు 21 : ఆ యువజంట కల్యాణం లోక కల్యాణం కోరుకున్నది. పెద్దలు.. వేద మంత్రాల సాక్షిగా ఒక్కటవుతున్న ఆ జంట పెండ్లి వేడుక బంధుమిత్రులకు ఆనందాన్నే కాకుండా.. అభాగ్యులకు ఆసరాగా నిలుస్తున్నది. ప్రస్తుత పరిస్థితుల్లో పెండ్లంటే విలువైన బహుమతులు.. రిటర్న్ గిఫ్టుల హడావిడీ సర్వ సాధారణం. తమ వివాహ వేడుకలకు ఎంతటి వీఐపీలు వస్తారా? ఏమి బహుమతులిస్తారా? అని ఎదురు చూస్తున్న సందర్భాలు లేకపోలేవు.
కానీ ఈ యువజంట పెండ్లి వేడుకలో అలాంటివేవి కానరావు. ఆ సంప్రదాయానికి చరమ గీతం పాడుతూ.. కొత్త సామాజిక సేవకు శ్రీకారం చుడుతూ.. యావత్ సమాజానికి స్ఫూర్తిగా నిలువబోతున్నారా యువ జంట. ఒక్కటి కాబోతున్న ఆ యువ దంపతుల పెండ్లి వేడుకలు బుద్ధి మాంద్య చిన్నారులకు అండగా నిలువనున్నాయి.
వివాహానికి హాజరవుతున్న బంధు మిత్రుల నుంచి ఎటువంటి బహమతులు స్వీకరించబోమని.. బుద్ధి మాంద్యంతో బాధపడుతున్న చిన్నారులకు సేవలందిస్తున్న చారిటబుల్ ట్రస్ట్కు విరాళంగా ఇవ్వాలని ఆహ్వాన పత్రికలో ప్రచురించారు. సదరు చారిటబుల్ ట్రస్ట్ సంస్థకు చెందిన స్కానర్ను సైతం ఆహ్వాన పత్రికలో పొందు పరిచారు. పెండ్లి కూతురు తల్లిదండ్రులు యాయవరం వెంకటరమణ జ్యోతి దంపతులు ఈ నిర్ణయం తీసుకుని తమ సేవా తత్పరతను చాటుకున్నారు. అంతేకాకుండా పెండ్లికి హాజరైన బంధు మిత్రాదులకు ఎటువంటి రిటర్న్ గిఫ్ట్లు ఇవ్వటం లేదని, అందుకోసం వెచ్చించే మొత్తాన్ని సైతం ఆ చారిటబుల్ ట్రస్టుకే ఇవ్వనున్నట్లు వారు ప్రకటించారు.
అమెరికాలో నివాసం..అక్కడే ఉద్యోగాలు
నగరానికి చెందిన యాయవరం వెంకటరమణ జ్యోతి దంపతులు గడిచిన 20 ఏండ్లుగా అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో నివాసముంటున్నారు. వెంకట రమణ ఐటీ ప్రొఫెషనల్గా పని చేస్తుండగా.. జ్యోతి గృహిణిగా ఉన్నారు. అంతర్జాతీయ సేవా సంస్థ హెచ్ఎస్ఎస్లో ఆ దంపతులు సేవా కార్యక్రమాలలో చురుకుగా భాగస్వాములవుతున్నారు. వారి పెద్ద కుమార్తె సమీర బీ టెక్ పూర్తి చేసి అమెరికాలోనే సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పని చేస్తున్నది.
అదే రాష్ర్టానికి చెందిన తిరుపతయ్య నాగజ్యోతిల కుమారుడు ఐటీ ఉద్యోగి అయిన ఆదిత్యతో ఈ నెల 22న నగరంలోని బేగంపేట మ్యారీ గోల్డ్ హోటల్లో వీరి వివాహ వేడుక జరుగనున్నది. అమెరికాలో పలు సేవా కార్యక్రమాలలో పాల్గొన్న వెంకటరమణ జ్యోతి దంపతులు తమ కుమార్తె విహహ వేడుకలకు బంధు మిత్రులను ఆహ్వానించే ఆహ్వాన శుభ పత్రికలలో ఎటువంటి బహమతులను తీసుకురావద్దని, వాటికి బదులుగా తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరులో కొన్ని సంవత్సరాలుగా అభాగ్యులకు అండగా నిలుస్తూ సేవలందిస్తున్న ‘ద అమేజ్ చారిటబుల్ ట్రస్ట్’ సంస్థకు విరాళం అందించాలని ప్రచురించారు.
ఆ సంస్థకు చెందిన స్కానర్ను సైతం ఆహ్వాన పత్రికలో అచ్చువేసి పంపిణీ చేశారు. దీంతో పాటు వివాహానికి హాజరైన బంధు మిత్రులకు ఎటువంటి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వటం లేదని.. వాటి కొనుగోలు పేరిట వెచ్చించే మొత్తాన్ని సైతం సదరు చారిటబుల్ ట్రస్ట్కే విరాళంగా ఇస్తున్నట్లు వెంకటరమణ జ్యోతి దంపతులు వెల్లడించారు. తమ కుమార్తెతో పాటు కాబోయే అల్లుడు కుటుంబ సభ్యుల మద్దతును కూడగట్టుకుని ఈ సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు పేర్కొన్నారు. ఈ తరహా సేవా కార్యక్రమాలు కొందరికైనా స్ఫూర్తిగా నిలవాలన్నదే తమ ఆలోచనని రమణజ్యోతి తెలిపారు.
తమ కుమారుడు ఆదిత్య వివాహ వేడుకల సందర్భంగా వధువు సమీర తల్లిదండ్రుల సేవా ప్రతిపాదన తమకు ఎంతగానో నచ్చిందని తిరుపతయ్యనాగజ్యోతి దంపతులు పేర్కొన్నారు. కాగా రమణజ్యోతి దంపతుల ఆహ్వానాలు అందుకున్న బంధు మిత్రులు ఇప్పటికే సదరు స్కానర్ ఆధారంగా ‘ద అమేజ్ చారిటబుల్ ట్రస్ట్’కు కొంత మేర విరాళాలు పంపినట్లు తెలిపారు. అయితే ఈ తరహా సామాజిక సేవ కలిగిన కల్యాణ వేడుకలు విదేశాలలో ఉండగా.. స్వదేశంలో మాత్రం ఇదే తొలిసారి అనే అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి.