ఇటీవల కరోనా నుంచి కోలుకుందా మహిళ. కానీ ఆమె ఆరోగ్యం మాత్రం ఏమాత్రం కుదుటపడలేదు. కరోనా పంజా నుంచి తప్పించుకున్నానని సంతోషించేలోపే బ్లాక్ ఫంగస్ దాడి చేసింది. దీంతో శరీరంలో కొన్ని అవయవాలు దెబ్బతిన్నాయి. ముక్కు వద్ద అసలు స్పర్శ కోల్పోయింది. పూర్తిగా ఒక రకమైన మైకంలోకి వెళ్లిపోయిన ఆమెను కుటుంబ సభ్యులు హైదరాబాద్ తీసుకొచ్చారు. ఇక్కడి వైద్యులు ఆమెకు చికిత్స అందిస్తూ షాకయ్యారు.
ఎందుకంటే ఆ మహిళ ముక్కులో సుమారు 150 ఈగ లార్వాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరుకు చెందిన సదరు మహిళ వయసు 50 ఏళ్లు. ఆరు నెలల క్రితం కరోనా బారిన పడిన ఆమె.. దీన్నుంచి కోలుకున్న వెంటనే బ్లాక్ ఫంగస్ బారిన పడింది. ఆమెను హైదరాబాద్లోని సెంచరీ ఆస్పత్రికి తీసుకొచ్చారు. అక్కడ కొన్ని పరీక్షలు చేసిన వైద్యులు ఆమె మెదడులో కొంత భాగం పూర్తిగా దెబ్బతిన్నదని గుర్తించారు. అలాగే కిడ్నీలు కూడా సరిగా పనిచేయడం లేదు. దీంతో శస్త్రచికిత్స చేశారు.
ఈ సమయంలో ఆమె కుడి కన్ను తొలగించాల్సి వచ్చింది. ఆ సమయంలోనే మహిళ ముక్కులో సుమారు 150 వరకూ ఈగ లార్వాలను వైద్యులు గమనించారు. అవి మెదడుకు చాలా దగ్గరగా ఉన్నాయని, ఆ ప్రదేశంలో స్పర్శ కోల్పోవడంతో ఆమెకు ఈ విషయం తెలియలేదని వైద్యులు తెలిపారు. మహిళ ముక్కులోకి వెళ్లిన ఈగలు గుడ్లు పెట్టాయని, కొన్నిరోజులకు అవి లార్వాలుగా మారాయని చెప్పారు.
ఇంకా ఆలస్యమై ఉంటే అవి ఆమె మెదడులోకి చేరి చాలా నష్టం చేసేవని, ఇప్పటికే మెదడుకు సమీపంలో ఉన్న చాలా ఎముకలు పూర్తిగా ఇన్ఫెక్షన్కు గురవడంతో ఆమెకు ఈ విషయం అసలు తెలియలేదన్నారు. మహిళ శస్త్రచికిత్స విజయవంతంగా ముగించామని, ఈగ లార్వాలను కూడా తొలగించామని వైద్యులు వెల్లడించారు.