సివిల్ అంశాల్లో జోక్యం చేసుకోం
రాచకొండ సీపీ మహేశ్ భగవత్
సిటీబ్యూరో, ఏప్రిల్ 12(నమస్తేతెలంగాణ): ఖాళీ స్థలాలు ఉన్నవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, కాంపౌండ్ వాల్, ఇతర ఏర్పాట్లు చేసుకోవాలని రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్ భగవత్ సూచించారు. రాత్రివేళల్లో కొందరు జేసీబీలతో కబ్జా చేస్తున్నారనే ఫిర్యాదులొస్తున్నాయని, వీటిపై కఠినంగా ఉంటామని స్పష్టం చేశారు.
మంగళవారం నేరేడ్మెట్ కమిషనర్ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. స్థలాలు కొనుగోలు చేస్తున్న వారు కచ్చితంగా 30 ఏండ్ల లీగల్ సెర్చ్ డాక్యుమెంట్లు చూసుకోవాలని, ధరలు పెరుగుతుండడంతో డబుల్ రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయని, కొనుగోలు చేసే సమయంలో వాటికి సంబంధించిన వివరాలను సబ్రిజిస్ట్రార్, రెవెన్యూశాఖలలో తనిఖీ చేసుకోవాలన్నారు. కొందరు సివిల్ వివాదాన్ని క్రిమినల్ అంశంగా మార్చి ఫిర్యాదులను సృష్టిస్తున్నారని పేర్కొన్నారు. పోలీసుస్టేషన్లలో ల్యాండ్ పంచాయితీలు చేయమని, పోలీసులు ఎవరైనా అనవసరంగా భూవివాదాల్లో జోక్యం చేసుకుంటే కఠిన చర్యలు ఉంటాయని సీపీ హెచ్చరించారు.