సిటీబ్యూరో, మార్చి 18 (నమస్తే తెలంగాణ): గ్రేటర్లో పారిశుద్ధ్య నిర్వహణపై మరింత ఫోకస్ పెట్టాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ అధికారులను ఆదేశించారు. బుధవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో శానిటేషన్ నిర్వహణపై అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రతి రోజు ఉదయం 9.30 గంటల కల్లా ప్రధాన రహదారుల వెంట చెత్త పూర్తిగా తొలగించి క్లీన్గా ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు.
ఈ విషయంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తే సంబంధిత డిప్యూటీ కమిషనర్లు, ఎస్డబ్ల్యూ డీఈఈలపై చర్యలు తీసుకుంటామని కమిషనర్ హెచ్చరించారు. శానిటేషన్ బాధ్యత ప్రధానంగా డిప్యూటీ కమిషనర్లు, ఎస్డబ్ల్యూఎం డీఈఈలదేనని పేర్కొన్నారు. గ్రీన్ వెస్ట్ తొలగింపు బాధ్యతను కూడా ఇకపై ఎస్డబ్ల్యూం విభాగమే నిర్వహించాలని తెలిపారు. ఈ సమావేశంలో శానిటేషన్ అదనపు కమిషనర్ రవి కిరణ్, జోనల్ కమిషనర్లు ప్రియాంక అలా, మందా మకరందు, ముకుందారెడ్డి, డిప్యూటీ కమిషనర్లు, ఎస్డబ్ల్యూఎం డీఈఈ, రాంకీ ప్రతినిధులు పాల్గొన్నారు.