సిటీబ్యూరో, జనవరి 4 (నమస్తే తెలంగాణ) : విద్యార్థులు పరీక్షలో తప్పితే ఉపాధ్యాయులదే బాధ్యత అవుతుందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. గురువారం కలెక్టరేట్లో పదో తరగతి పరీక్షలపై సంబంధిత అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు పదో తరగతిలో ఉత్తీర్ణులైతేనే జీవితంలో మెరుగైన స్థానంలో ఉంటారని అన్నారు.
అందుకోసం చదువులో వెనకబడిన విద్యార్థులకు మంచి శిక్షణ ఇప్పిస్తే వారు కూడా మెరుగైన ఫలితాలు సాధించడానికి అవకాశం ఉంటుందన్నారు. గత ఏడాదిలో పదో తరగతి ఫలితాలలో 80 శాతం సాధిస్తే ఈ సారి అంతకంటే ఎక్కువ ఉత్తీర్ణత సాధించే విధంగా కృషి చేయాలన్నారు. పది పరీక్షలో మంచి ఫలితాలు సాధించడం కోసం మెరుగైన ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు.
ఇందుకోసం డిప్యూటీఈవోలు, డీఐవోలు ప్రణాళికతో పని చేస్తే ఫలితాలు వస్తాయన్నారు. వచ్చే 70 రోజుల్లో గణితం, సామాన్య శాస్ర్తాలలో వెనుకబడిన విద్యార్థులపై ప్రధానోపాధ్యాయులు అధిక శ్రద్ధ వహించాలన్నారు. స్లిప్ టెస్టులు, మార్కు టెస్టులు వాటి వాటితో రివిజన్ చేపిస్తే.. ఫైనల్ పరీక్షలలో విద్యార్థులకు సులువుగా ఉంటుందన్నారు. కొనసాగింపుగా పదో తరగతి విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశం ఏర్పాటు చేసి, పిల్లల చదువు స్థితిగతుల గురించి తెలియచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఈవో రోహిణితో పాటు ఇతర విద్యాధికారులు పాల్గొన్నారు.