అబిడ్స్, జూన్ 7: మృగశిర కార్తె ప్రవేశం సందర్భంగా అస్తమా వ్యాధిగ్రస్తులకు బత్తిని కుటుంబీకులు 9వ తేదీన చేపట్టే చేప ప్రసాదం పంపిణీకి అధికార యంత్రాంగం పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నది. జూన్ 9వ తేదీ ఉదయం 7 గంటలకు చేప ప్రసాదం పంపిణీని ప్రారంభిస్తారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఏర్పాట్లపై రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు.
ముమ్మరంగా ఏర్పాట్లు
చేప ప్రసాదం పంపిణీకి ఆర్ అండ్ బీ అధికారులు షెడ్స్, ఫ్లడ్ లైట్లు, భారీకేడ్లు ఏర్పాటు చేయగా.. ఆర్టీసీ అధికారులు ప్రత్యేకంగా బస్సులను నడపడం, జీహెచ్ఎంసీ అధికారులు శానిటేషన్, మరుగుదొడ్లను ఏర్పాటు చేయడం, జలమండలి అధికారులు మంచినీటిని అందుబాటులో ఉంచడం, సమాచార శాఖతో పాటు వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులు ఎగ్జిబిషన్ మైదానంలో చేప ప్రసాదం పంపిణీని విజయవంతం చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.
అప్పుడే తరలివచ్చిన ప్రజలు…
దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ఉబ్బస వ్యాధి గ్రస్తులు వారి సహాయకులతో కలిసి అప్పుడే నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానానికి చేరుకున్నారు. ఎగ్జిబిషన్ మైదానంలో ఏర్పాటు చేసిన బారీకేడ్లలో వారు సేద తీరుతున్నారు.
చేప ప్రసాదం సందర్భంగా ప్రత్యేక బస్సులు
నగరంలోని ఎగ్జిబిషన్ మైదానంలో చేప ప్రసాదం పంపిణీ సందర్భంగా ప్రయాణికుల కోసం ఈ నెల 8 నుంచి 10 వరకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తూ ఆర్టీసీ గ్రేటర్ జోన్ అధికారులు బుధవారం నిర్ణయం తీసుకున్నారు. నగరంలోని సికింద్రాబాద్ స్టేషన్, కాచిగూడ రైల్వే స్టేషన్, జేబీఎస్, ఎంజీబీఎస్, ఈసీఐఎల్ ఎక్స్ రోడ్, శంషాబాద్ ఎయిర్పోర్టు వంటి ప్రాంతాల నుంచి దాదాపు 50 బస్సులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అలాగే మరో 14 ప్రాంతాల నుంచి ఎగ్జిబిషన్ గ్రౌండ్ వరకు 80 బస్సులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
చేప ప్రసాదం నేపథ్యంలో..
ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో చేప ప్రసాదం పంపిణీ సందర్భంగా 8వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి 10వ తేదీ అర్ధరాత్రి వరకు ఎగ్జిబిషన్ గ్రౌండ్, నాంపల్లి పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీగా ఉండే అవకాశం ఉన్నదని, ఈ నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు నగర ట్రాఫిక్ అదనపు సీపీ సుధీర్బాబు తెలిపారు. మృగశిర కార్తి సందర్భంగా అస్తమ వ్యాధిగ్రస్తుల కోసం చేపమందు పంపిణీ చేస్తుంటారు. మన రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచే కాకుండా ఇతర రాష్ర్టాల నుంచి కూడా భారీ సంఖ్యలో ప్రజలు వస్తుంటారు. దీంతో ఈ పరిసర ప్రాంతాల్లో ఎగ్జిబిషన్ గ్రౌండ్, పరిసరాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది. ట్రాఫిక్ రద్దీని బట్టి, ట్రాఫిక్ మళ్లింపు, నిలిపివేతలు చేపడుతామని, వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని అదనపు సీపీ సూచించారు.
అవసరాలను బట్టి ట్రాఫిక్ మళ్లింపులు