కేపీహెచ్బీ కాలనీ, జనవరి 21 : కరోనా కట్టడి దిశగా ప్రభుత్వం చేపట్టిన ‘జ్వర సర్వే’ కూకట్పల్లి జోన్ పరిధిలోని ఐదు సర్కిళ్లలో ప్రారంభమైంది. కరోనా మూడోదశ ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో ప్రజలందరినీ అప్రమత్తం చేస్తూ కరోనా బారిన పడకుండా ఉండాలంటే తీసుకోవాల్సిన అన్ని రకాల జాగ్రత్తలను వివరిస్తున్నారు. రెండో దశలో కరోనా వ్యాప్తిని కట్టడి చేయడంలో అవలంభించిన విధానాలను మరోసారి అమలు చేస్తున్నారు. దీనిలో భాగంగా ఇంటింటికి తిరిగి జ్వరం సర్వేను చేపట్టడం.. సర్వే ద్వారా కరోనా లక్షణాలు కనిపించిన వారికి ఐసొలేషన్ కిట్లను వెంటనే అందిస్తున్నారు. ఇంటి పరిసరాలను శానిటైజేషన్ చేస్తూ కరోనా మరొకరికి వ్యాప్తి చెందకుండా ఉండేందుకు జాగ్రత్తలు వివరిస్తున్నారు. కరోనా లక్షణాలు తీవ్రంగా ఉంటే సమీపంలోని ఆరోగ్య కేంద్రాలు, బస్తీ దవాఖానలకు వెళ్లి పరీక్షలు చేయించుకునేలా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. దీనిలో భాగంగా కూకట్పల్లి జోన్ పరిధిలోని ఐదు సర్కిళ్లలో మొదటి రోజు ఫీవర్ సర్వేను నిర్వహించగా, జ్వర లక్షణాలు కనిపించిన వారికి ఐసొలేషన్ కిట్ల పంపిణీని ప్రారంభించారు.
పకడ్బందీగా ఫీవర్ సర్వే..
కరోనా కట్టడికి పకడ్బందీగా ఫీవర్ సర్వేను చేస్తున్నట్లు కూకట్పల్లి జోనల్ కమిషనర్ వి.మమత తెలిపారు. శుక్రవారం కూకట్పల్లి, మూసాపేట సర్కిళ్ల పరిధిలోని వివిధ ప్రాంతాల్లో ఫీవర్ సర్వేను డీసీలతో కలిసి జడ్సీ మమత పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జోన్ పరిధిలోని ఐదు సర్కిళ్లలో 3.57 లక్షల నివాసాలు ఉండగా, 168 మురికి వాడలను గుర్తించినట్లు తెలిపారు. స్లమ్ ఏరియాలోని 80 వేల ఇండ్లలో ఇంటింటికి తిరిగి ఫీవర్ సర్వేను చేయడానికి 374 బృందాలు రంగంలోకి దిగాయన్నారు. తొలిరోజు 16 వేల ఇండ్లలో సర్వే చేయగా జ్వర లక్షణాలతో బాధపడుతున్న 1113 మందికి కరోనా ఐసొలేషన్ కిట్లను అందించినట్లు తెలిపారు. ఆరు రోజుల్లోగా ప్రతీ ఇంటికి వెళ్లి సర్వే చేయడం జరుగుతుందని జ్వర లక్షణాలు ఉన్నవారు సిబ్బందికి వారి వివరాలు తెలిపి ఐసొలేషన్ కిట్ను పొంది జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో డీసీలు రవికుమార్, రవీందర్కుమార్, ఏఎంహెచ్వోలు చంద్రశేఖర్ రెడ్డి, సంపత్కుమార్, సిబ్బంది ఉన్నారు.
తొలిరోజు సర్వే షురూ..
కూకట్పల్లి జోన్ పరిధిలోని మూసాపేట, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, గాజులరామారం, అల్వాల్ సర్కిళ్లలో ఫీవర్ సర్వే ప్రారంభమైంది. జోన్ పరిధిలో 3,57,521 గృహాలు ఉండగా, 374 బృందాలు ఫీవర్ సర్వేలో పాల్గొన్నాయి. మూసాపేట సర్కిల్లో 1,19,351 గృహాలకు గాను 82 బృందాలు, కూకట్పల్లి సర్కిల్లో 78,555 గృహాలకు గాను 120 బృందాలు, కుత్బుల్లాపూర్ సర్కిల్లో 35,604 గృహాలకు గాను 55 బృందాలు, గాజులరామారం సర్కిల్లో 80,565 గృహాలకు గాను 81 బృందాలు, అల్వాల్ సర్కిల్లో 43,441 గృహాలకు గాను 36 బృందాలు ఇంటింటి సర్వేలో పాల్గొన్నారు.
1113 కిట్ల పంపిణీ..
జోన్ పరిధిలోని ఐదు సర్కిళ్లలో తొలిరోజు 24,116 ఇండ్లలో ఫీవర్ సర్వేను నిర్వహించగా, వీరిలో 1113 మంది జ్వరం, దగ్గుతో బాధపడుతున్న వారిని గుర్తించారు. 1113 మందికి హోమ్ ఐసొలేషన్ కిట్లను పంపిణీ చేశారు. సర్కిళ్ల వారీగా పరిశీలిస్తే మూసాపేట సర్కిల్లో 8295 ఇండ్లలో సర్వే చేయగా, 583 మందికి ఐసొలేషన్ కిట్లను అందించారు. కూకట్పల్లి సర్కిల్లో 7840 ఇండ్లలో సర్వే చేయగా, 228 మందికి ఐసొలేషన్ కిట్లు, కుత్బుల్లాపూర్ సర్కిల్లో 2882 ఇండ్లలో సర్వే చేయగా 119 ఐసొలేషన్ కిట్లు, గాజులరామారం సర్కిల్లో 3735 ఇండ్లలో సర్వే చేయగా, 133 ఐసొలేషన్ కిట్లు, అల్వాల్ సర్కిల్లో 1364 ఇండ్లలో సర్వే చేయగా, 50 ఐసొలేషన్ కిట్లు అందించారు.