సుల్తాన్బజార్, జనవరి 24: పరీక్షల్లో తక్కువ మార్కులు వస్తాయని భయపడ్డ 11 ఏండ్ల బాలుడు ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బెంగళూరు నుంచి హైదరాబాద్కు వచ్చాడు. ఆ బాలుడు నాంపల్లి మెట్రో రైల్వే స్టేషన్లో తచ్చాడుతుండగా మెట్రో అధికారులు గమనించి నాంపల్లి పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకొని బాలుడిని చేరదీసి, పోలీస్స్టేషన్కు తీసుకెళ్లి వివరాలను సేకరించారు.
ఇన్స్పెక్టర్ అభిలాష్ కథనం ప్రకారం.. బెంగళూరులోని వైట్ఫీల్డ్ ప్రాంతానికి చెందిన సుఖేష్ అరయ్ కుమారుడు పరిణవ్ అరయ్ (11) ఆరో తరగతి చదు వుతున్నాడు. మంచి మార్కుల కోసం ట్యూషన్ కూడా వెళ్తున్నాడు. అయినా.. తనకు తక్కువ మార్కులు వస్తాయన్న భయంతో పరిణవ్ అరవ్ ఈ నెల 21న ట్యూషన్ తరగతులు ముగించుకొని బయటికి వచ్చి.. బస్సు ఎక్కి కనిపించకుండా పోయాడు. కేసు దర్యాప్తు చేపట్టిన వైట్ఫీల్డ్ పోలీసులు సీసీ కెమెరాల సహాయంతో 21వ తేదీ సాయంత్రం వరకు బాలుడి కార్యకలాపాలను గుర్తించారు.
మంగళవారం రాత్రి బెంగళూరులోని మెజిస్టిక్ రైల్వే స్టేషన్లో బాలుడిని చివరిగా గుర్తించారు. అక్కడి నుంచి బాలుడు చెన్నయ్ నుంచి హైదరాబాద్కు వచ్చే రైలులో హైదరాబాద్కు చేరుకున్నాడు. బుధవారం ఉదయం బాలుడు నాంపల్లి మెట్రో స్టేషన్లో తచ్చాడుతుండగా బెంగళూరు వాసి గుర్తించి మెట్రో అధికారులకు సమాచారమిచ్చాడు. వారు నాంపల్లి పోలీసులకు సమాచారమిచ్చారు. బాలుడిని చేరదీసిన నాంపల్లి పోలీసులు..తల్లిదండ్రులకు, వైట్ఫీల్డ్ పోలీసులకు సమాచారమిచ్చారు. నగరంలోనే ఉంటున్న బాలుడి మామ అలహరి మల్లికార్జున్ నాయుడుకు బాలుడిని అప్పగించారు.