ఖైరతాబాద్, జనవరి 21 : నిమ్స్ దవాఖానలో మల్టిపుల్ స్కెలరోసిస్ (ఎంఎస్)కు ఆధునిక చికిత్సలు అందుబాటులో ఉన్నాయని డైరెక్టర్ డాక్టర్ నగరి బీరప్ప తెలిపారు. ఆదివారం దవాఖానలోని న్యూరాలజీ విభాగం ఆధ్వర్యంలో లెక్చర్ హాల్లో మల్టిపుల్ స్కెలరోసిస్ అప్డేట్ పేరుతో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సును ఆయన ప్రారంభించారు. ఈ ఎంఎస్ వ్యాధిబారిన పడిన వారికి మధుమేహ రోగుల మాదిరిగా తిమ్మిర్లు, మంటలు, నీరసం ఉంటుందని తెలిపారు.
మెదడుకు సంకేతాలను పంపించే నరాలపై మైలిన్ పొర కప్పి ఉంటుందని, అది దెబ్బతిన్న వారికి ఈ వ్యాధి వస్తుందన్నారు. ఇలాంటి సమస్యలతో బాధపడే వారికి ఆధునిక చికిత్స విధానాలు నిమ్స్ దవాఖానలో అందుబాటులో ఉన్నాయని, వ్యాధి పూర్తిగా నయమవుతుందన్నారు. ఈ సదస్సులో నిమ్స్ న్యూరాలజీ విభాగాధిపతి డాక్టర్ అఫ్సాన్ జబీన్, ప్రొఫెసర్ సూర్యప్రభ, అసోసియేట్ ప్రొఫెసర్ శిరీష, వైద్యులు సుల్తానా షేక్, మహేశ్, కిమ్స్ వైద్యులు మోహన్, సీతాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.