సిటీబ్యూరో, మే 8 (నమస్తే తెలంగాణ) : నగరంలో సాయంత్రం 7 దాటిందంటే.. బస్సుల రాకపోకలు తగ్గుతున్నాయి. సమయపాలన లేకుండా నడుస్తున్నాయని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని రూట్లల్లో బస్సులు వస్తాయో రావో కూడా తెలియడం లేదని వాపోతున్నారు. రాత్రి సమయాల్లో బస్సుల రాకపోకలు తగ్గుతుండటంతో గమ్య స్థానాలకు ప్రయివేట్ వాహనాలను ఆశ్రయించాల్సి వస్తోందని చెబుతున్నారు.
మరోవైపు బస్సుల సమాచారం సూచీ బోర్డులో ఒకలా.. రాకపోకలు మరోలా ఉంటుండంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మహాలక్ష్మి ఉచిత బస్సు పథకంతో సిటీ బస్సుల్లో ఆక్యుపెన్సీ రేషియో 95 శాతానికి పెరిగింది. గ్రేటర్ జోన్ పరిధిలో ఆర్టీసీ నడుపుతున్న సిటీ బస్సుల్లో రోజు 24 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు.
ప్రయాణికుల రద్దీ రెట్టింపైనా అధికారులు అందుకు తగిన విధంగా బస్సుల ఏర్పాటు చర్యలు తీసుకోకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సెలవు రోజుల్లో కూడా బస్సుల రాకపోకలను పరిమితం చేస్తున్నారు. రద్దీ ఉన్నప్పటికీ బస్సులను కేటాయించడం లేదు. గమ్యం యాప్ నిర్వహణ సరిగా ఉంటే బస్సుల సమాచారం తెలుసుకుని బస్సుల్లోనే ప్రయాణికులు ప్రయాణించే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ఆర్టీసీ ఉన్నతాధికారులకు సైతం ప్రయాణికులు ఫిర్యాదులు చేస్తున్నారు.