అర్ధరాత్రి ఆపద వచ్చినా.. అలుమగలు గొడవపడినా.. అనుకోని ప్రమాదం ఎదురైనా.. ఒక్క ఫోన్కాల్తో క్షణాల్లో వాలిపోతారు. అవాంతరాల నుంచి బయటపడేస్తారు. లాఠీపట్టి బందోబస్తు బాధ్యతలే కాదు.. ప్రాణదాతలుగా మారుతున్నారు రక్షకభటులు. 24X7 డయల్ 100 ప్రజలకు సేవలు అందిస్తున్నది. ఫోన్కాల్ చెవినితాకగానే వాయువేగంతో ఘటనా స్థలికి చేరుకుంటున్నారు.
“88 ఏటీఎంలో దొంగలు పడ్డారు.. అందులో అలజడి రాగానే బ్యాంకు అధికారులకు సైరన్ వినిపించింది. వెంటనే డయల్ 100కు ఫోన్ చేయడంతో ఐదు నిమిషాల్లో రాచకొండ పోలీసులు అక్కడకు చేరుకున్నారు. ఆ సమయంలో దొంగ ఏటీఎం కేంద్రంలో దొంగతనానికి విఫలయత్నం చేస్తుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.” ఇలా డయల్ 100కు ఫోన్ చేయడంతో వేగంగా పోలీసు సేవలు అందుతున్నాయి.
– సిటీబ్యూరో, ఏప్రిల్ 16 (నమస్తే తెలంగాణ)
డయల్ 100 నంబర్కు వచ్చే ఫోన్ కాల్స్ను ఐటీసెల్ పర్యవేక్షిస్తుంటుంది. సాంకేతిక పరిజ్ఞానం సాయంతో మొబైల్ పెట్రోలింగ్ వాహనం, ఎస్హెచ్వో, పోలీస్ స్టేషన్ అందర్నీ ఒకేసారి అప్రమత్తం చేస్తారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరేంత వరకు అన్ని స్థాయిల్లోని యంత్రాంగం పర్యవేక్షణ కొనసాగుతుంది. ఫోన్ చేసిన వారికి సాయం అందగానే దాన్ని రికార్డు రూపంలో భద్రపరుస్తున్నారు. కొన్ని సందర్భాలలో మాత్రం ఒకే సారి రెండు మూడు కాల్స్ రావడంతో ఒక కాల్ అటెండ్ చేసి, అక్కడి నుంచి మరో ప్రాంతానికి సిబ్బంది వెళ్లే వరకు కొద్ది సమయం పట్టే అవకాశముంటుంది. అయితే ఇందులో అత్యవసరమైనదానికి సిబ్బంది ముందుగా ప్రాధాన్యత ఇస్తారు. ఆలస్యమైతే కారణాలను విశ్లేషించి బాధ్యులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటున్నారు. ఇదంతా సైబరాబాద్ పరిధిలోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ నుంచి నిరంతర పర్యవేక్షణ ఉంటుంది.
బంజారాహిల్స్, ఏప్రిల్ 17 : నేరం జరిగిన నిమిషాల్లోనే సంఘటనా స్థలానికి చేరుకోవడంతో పాటు చాకచక్యంగా వ్యవహరించి ఇద్దరు చైన్ స్నాచర్లను అరెస్ట్ చేసిన జూబ్లీహిల్స్ పోలీసులను నగర పోలీస్ కమిషనర్ సీవీ.ఆనంద్ అభినందించారు. గురువారం రాత్రి 11 గంటల ప్రాంతంలో వెంకటగిరిలోని ఓ వైన్షాపు వద్ద వెంకటేశ్ అనే వ్యక్తి మెడలోని బంగారు చైన్ను గుర్తుతెలియని దుండగులు లాక్కొని పారిపోయారు. ఈ సంఘటనపై సమాచారం అందుకున్న జూబ్లీహిల్స్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, ఎస్ఐ నర్సింగరావు, హోంగార్డు సురేశ్ ఘటనా స్థలానికి చేరుకొని 20 నిమిషాల వ్యవధిలోనే నిందితులు రంజిత్(30), షేక్ షర్ఫుద్దీన్(28)ను పట్టుకున్నారు. వారి వద్దనుంచి గొలుసును స్వాధీనం చేసుకున్నారు. ఫిర్యాదు అందుకున్న ఆరగంటలోనే నిందితులను పట్టుకొని సొత్తు రికవరీ చేసిన జూబ్లీహిల్స్ డీఐ శ్రీనివాస్, ఎస్ఐ నర్సింగరావు, హోంగార్డు సురేశ్లను నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ సోమవారం పిలిపించి రివార్డు అందజేయడంతో పాటు ప్రశంసాపత్రం, నగదు ప్రోత్సాహం అందించారు. వారిపనితీరును ప్రశంసించారు.