‘హరహర మహాదేవ.. శంభో శంకర’ అంటూ సాగిన శివనామస్మరణతో మహానగరంలోని శైవ క్షేత్రాలు మారుమోగాయి. శుక్రవారం మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా భక్తులతో కిక్కిరిసిపోయాయి. తెల్లవారుజాము నుంచే ఆలయాల ఎదుట భక్తులు బారులు తీరి పరమశివుడిని దర్శించుకుని పునీతులయ్యారు.
కీసరగుట్టలోని శ్రీ రామలింగేశ్వరస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి స్వామివారికి పట్టువస్ర్తాలను సమర్పించారు. స్వామివారికి వేదపండితులు మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, సామూహిక అభిషేకాలు, రుద్రస్వాహకార హోమం వంటి కార్యక్రమాలు నిర్వహించారు.