సిటీబ్యూరో, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ) : ‘మన బస్తీ -మన బడి’ కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు 80 శాతం వరకు పూర్తయ్యాయని, మిగిలిన పనులు కూడా ఈ నెల 15వ తేదీ లోగా పూర్తి చేయాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సెక్రటేరియట్లో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమం అమలుకు నిధుల కొరత లేదని, పనులు జరిగిన వెంటనే బిల్లులు చెల్లింపులు జరుగుతాయన్నారు. స్కూళ్లలో పచ్చదనాన్ని పెంపొందించేలా మొక్కలు నాటి, విద్యార్థులకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించాలన్నారు. ప్రత్యేక అవసరాలు కలిగిన వారి కోసం పాఠశాలల్లో ర్యాంపులు నిర్మించాలన్నారు. సివిల్ పనులు పూర్తయిన వెంటనే స్కూల్కు రంగులు వేసి అలంకరించాలని అధికారులకు సూచించారు. ఈ సమీక్ష సమావేశంలో డీఈవో రోహిణి, డిప్యూటీ ఈవోలు, డిప్యూటీ ఈఈలు, డిప్యూటీ ఇన్స్పెక్టర్లు, సెక్టోరియల్ ఆఫీసర్లు, సహాయ ఇంజినీర్లు, కాంట్రాక్టర్లు తదితరులు పాల్గొన్నారు.