మలక్పేట, డిసెంబర్ 17 : మూసారాంబాగ్, పాత మలక్పేట డివిజన్లలో అభివృద్ధి పనులు ఊపందుకున్నాయి. రెండు డివిజన్లలో రూ.లక్షల వ్యయంతో రోడ్లు, డ్రైనేజీ, పార్కుల అభివృద్ధి, మోడల్ మార్కెట్, తదితర అభివృద్ధిపనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.
కొన్ని పనులు పూర్తి కాగా.. మరికొన్ని చివరిదశలో..
పాత మలక్పేట డివిజన్లోని అఫ్జల్నగర్ కాలనీలో సీసీ రోడ్డు, రబ్బర్ స్పీడ్ బ్రేకర్ల ఏర్పాటు, సాలార్ యే మిల్లత్ పార్కులో హైమాస్ట్ లైట్ల ఏర్పాటు, మున్సిపల్ కాలనీలో సీసీ రోడ్డు, మోడల్ మార్కెట్ పనులు, తీగలగూడలో బీటీ రోడ్డు, బాక్స్డ్రైన్ పనులు పూర్తవగా, మూసారాంబాగ్ డివిజన్లోని అరోరా కళాశాల వద్దగల హిందూ శ్మశాన వాటికలో రూ.20 లక్షలతో నిర్మించనున్న విశ్రాంతి, స్నానపు గదులు, దహనవాటిక, మోడ్రన్ టాయ్లెట్ల నిర్పాణ పనులు కొనసాగుతుండగా, సాయినగర్లో డ్రైనేజీలైన్ల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి, శాలివాహననగర్ ఆర్చ్వద్ద రూ.10 లక్షలతో సీసీ రోడ్డు, సలీంనగర్లోని హిల్ వ్యూ పార్కువద్ద రూ.6 లక్షల వ్యయంతో చేపట్టిన సీసీ రోడ్డు నిర్మాణ పనులు పూర్తయినాయి.
వివేకానంద సెంటినరీ పాఠశాల వద్ద, ఇంద్రానగర్ కాలనీల్లో డ్రైనేజీలైన్ల నిర్మాణాలు పూర్తవగా, శాలివాహననగర్లోని హార్లే డేవిడ్సన్ షోరూం వద్ద రూ.6 లక్షల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్డు నిర్మాణపనులు, బ్యాండ్ బస్తీలో డ్రైనేజీ లైన్ల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. కృష్ణతులసి నగర్లో రూ.20 లక్షలతో కమ్యూనిటీ నిర్మాణ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. దాంతో రెండు డివిజన్లలోని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నెల రోజుల్లో ఈ పనులన్నింటిననీ పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నామని అధికారులు తెలిపారు.
నాణ్యతకు ప్రాధాన్యతనిస్తున్నాం
మూసారాంబాగ్, పాత మలక్పేట డివిజన్లలో రూ. లక్షల వ్యయంతో అభివృద్ధి పనులు చేపట్టాం. కొన్ని ఇప్పటికే పూర్తవగా, కొన్ని కాలనీల్లో పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. మొన్నటివరకు నిధుల లేమీతో పనులు ప్రారంభం కాలేదు. ఇప్పుడిప్పుడే రెండు డివిజన్లలో పనులు జరుగుతున్నాయి. నిర్మాణ పనుల్లో నాణ్యతకు ప్రాధాన్యత ఇస్తుండటంతో పనులు కొంచెం ఆలస్యమవుతున్నాయి. సకాలంలో పూర్తి చేసేందుకు కృషిచేస్తున్నాం.
– ప్రదీప్, ఏఈ