కేపీహెచ్బీ కాలనీ, జనవరి 10 : అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి అన్నారు. సోమవారం కూకట్పల్లి జోన్ కార్యాలయంలో అభివృద్ధి పనులపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో మేయర్ గద్వాల విజయలక్ష్మి, కూకట్పల్లి జోనల్ కమిషనర్ వి.మమత పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. కూకట్పల్లి జోన్ పరిధిలోని ఐదు సర్కిళ్లలో అన్ని శ్మశానవాటికలలో మౌలిక వసతులు కల్పించాలని నీటి, విద్యుత్ సౌకర్యాన్ని కల్పించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని తెలిపారు. మున్సిపల్ కమ్యూనిటీహాళ్లలో సౌకర్యాలు కల్పించి పరిశుభ్రంగా ఉంచాలన్నారు. పబ్లిక్ టాయిలెట్లలో నీటి వసతి, విద్యుత్ సౌకర్యాలు ఉండేలా చూడాలన్నారు. ఫుట్పాత్ ఆక్రమణలపై దృష్టిసారించాలని ఆక్రమణలను తొలగించి పాదచారులకు ఇబ్బందులు లేకుండా చూడాలని పేర్కొన్నారు. ఎస్ఎన్డీపీలో మంజూరైన నాలాల అభివృద్ధి పనులను వేగవంతం చేయాలన్నారు. రాబోయే వర్షాకాలంలోగా పనులు పూర్తి కావాలని తెలిపారు. వర్షంనీటి కాలువలలో పూడికతీత పనులను వేగవంతం చేయాలని నిర్ణీత గడువులోగా పనులు పూర్తయ్యేలా చూడాలని పేర్కొన్నారు.
థీమ్ పార్కులను పూర్తి చేయాలి..
జోన్ పరిధిలో నిర్మాణంలో ఉన్న థీమ్ పార్కులతో పాటు ఇతర పార్కుల అభివృద్ధి పనులను తొందరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలన్నారు. శానిటేషన్ విభాగంలో ఉన్న కార్మికుల భర్తీని వెంటనే చేపట్టాలని.. విమర్శలకు తావులేకుండా నియామకాలు పారదర్శకంగా ఉండాలని సూచించారు. సాట్ ఆటోలు అన్ని కాలనీలలో.. అన్ని కుటుంబాల నుంచి చెత్తను సేకరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కొవిడ్ నేపథ్యంలో పబ్లిక్ ప్రాంతాలు, బస్టాండ్లు, ఆరోగ్య కేంద్రాలలో రసాయనాల పిచికారీని చేపట్టాలని.. ఆ పరిసరాలు పరిశుభ్రంగా చర్యలు తీసుకోవాలన్నారు.
గడువులోగా అనుమతులు..
భవన నిర్మాణ అనుమతులు నిర్ణీత గడువులోగా జారీ అయ్యేలా చూడాలన్నారు. టౌన్ప్లానింగ్ అధికారులు భవన నిర్మాణ ఫిర్యాదులపై వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఎస్ఈ చిన్నారెడ్డి, సీపీ ఉమాదేవి, ఉప కమిషనర్లు రవికుమార్, రవీందర్కుమార్, నాగమణి, ప్రశాంతి, మంగతాయారు, ఇంజినీరింగ్, శానిటేషన్, టౌన్ప్లానింగ్, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.