జంట జలాశయాల్లో ఒకటిగా నగరానికి తాగునీళ్లను అందించిన గండిపేట నేడు నగరవాసులకు ఆహ్లాద వాతావరణాన్ని అందించేందుకు ఐటీ కారిడార్లో అద్భుతమైన వేదికగా మారింది. నగర శివారులో గండిపేట జలాశయం నిత్యం వేలాది మంది సందర్శకులకు ఫేవరేట్ హాట్స్పాట్గా మారింది. వీకెండ్ వచ్చిందంటే చాలు… ఎక్కడికి వెళితే బాగుంటుందనుకునే వారికి ఠక్కున గుర్తొచ్చేదిగా గండిపేట నిలిచింది. మాదాపూర్ నుంచి మొదలయ్యే ఐటీకారిడార్ ప్రస్థానం.. గండిపేటను అనుకొని ఉన్న కోకాపేట దాకా విస్తరించింది. దీంతో ఐటీ కంపెనీలతో పాటు అందులో పనిచేసే లక్షలాది మంది ఉద్యోగులకు ఆధునిక ఆటవిడుపుగా గండిపేట లేక్వ్యూ పార్కు మారింది.
– సిటీబ్యూరో, నవంబర్ 8 (నమస్తే తెలంగాణ)
గండిపేట చెరువు లోపలి వైపు లేక్ వ్యూ పార్క్ను రూ.36 కోట్లతో అద్భుతంగా నిర్మించిన హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ(హెచ్ఎండీఏ) సంస్థ, రెండో దశలో భాగంగా మరో 70 ఎకరాల స్థలంలో విస్తరణకు ప్రతిపాదనలు రూపొందించింది. ఇందుకోసం సర్వే నంబరు 18, 45 పరిధిలోని సుమారు 70 ఎకరాల స్థలాన్ని ప్రభుత్వం హెచ్ఎండీఏకు అప్పగించారు. గండిపేట చెరువు కట్ట కింద ఉన్న ఈ స్థలం ప్రస్తుతం నిరుపయోగంగా ఉంది. పూర్తిగా చెట్లు, కొండలు, రాళ్లతో ఉంది. దీన్ని పూర్తి స్థాయిలో పార్కుగా అభివృద్ధి చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టింది.
హైదరాబాద్ మెట్రో పాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) గండిపేట జలాశయం తీరంలో లేక్ వ్యూ పార్కును రూ.36 కోట్లతో నిర్మించింది. గతేడాది అక్టోబర్లో మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభమైన లేక్ వ్యూ పార్కు అత్యాధునిక ల్యాండ్స్కేపింగ్తో ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు సందర్శకులకు సరికొత్త అనుభూతులను పంచుతోంది. ముఖ్యంగా సూర్యాస్తమయంలో గండిపేట జలాల్లోకి సూర్యుడు జారుకుంటున్నట్లుగా ఉండే దృశ్యాన్ని మాటల్లో వర్ణించలేకపోతున్నామని పలువురు ఆ ఫొటోలను షేర్ చేస్తూ చెబుతున్నారు.
జూబ్లీహిల్స్-మాదాపూర్ నుంచి మొదలయ్యే ఐటీ కారిడార్ కోకాపేట-నార్సింగి వరకు విస్తరించింది. దీంతో కోకాపేటను అనుకొని ఉన్న గండిపేట జలాశయం ఇప్పుడు ఆధునిక పర్యాటక క్షేత్రంగా మారింది. ఐటీ కారిడార్లోని కొండాపూర్లో ఉన్న బొటానికల్ గార్డెన్ తర్వాత ఆ స్థాయిలో ఆకర్షణీయంగా ఈ పార్కు మారింది. ప్రతి రోజు 1000 నుంచి 1500 మంది సందర్శకులు వస్తుంటే, వీకెండ్ మాత్రం 10వేల మంది వరకు వస్తున్నారని పార్కు నిర్వాహకులు తెలిపారు. ముఖ్యంగా కోకాపేట,ఫైనాన్సియల్ డిస్ట్రిక్, పుప్పాల్గూడ, మణికొండ, నార్సింగి, గచ్చిబౌలి ప్రాంతాలకు గండిపేట జలాశయం సమీపంలోనే ఉండడంతో సందర్శకుల తాకిడి ఎక్కువగా ఉంది. జలాశయం ఆనకట్టపై 500 మీటర్లు నడిచిన తర్వాత వచ్చే ప్రవేశ ద్వారం ఎంతో అద్భుతంగా ఉందని సందర్శకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
మూసీ వరద నేపథ్యంలో 1920లో 7వ నిజాం ఉస్మాన్ అలీ ఖాన్ మూసీ నదిపై గండిపేట సమీపంలో ఉస్మాన్ సాగర్( గండిపేట చెరువు)ను నిర్మించారు. నగరాన్ని వరదల నుంచి కాపాడడానికి, నగరవాసులకు తాగునీటి కోసం ఈ జలాశయాన్ని అప్పటి ప్రముఖ ఇంజినీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సాంకేతిక సహకారంతో ఆధునిక ఇంజనీరింగ్ నైపుణ్యంతో నిర్మించారు. నగరానికి తాగునీరును అందిస్తూ, వరదలను అడ్డుకుంటున్న గండిపేట జలాశయం 100 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా తెలగాణ ప్రభుత్వం గండిపేటను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే బాధ్యతను హెచ్ఎండీఏకు అప్పగించింది. సుమారు రూ.100 కోట్ల నిధులతో గండిపేట చెరువును పూర్తి స్థాయిలో పరిరక్షించడంతో పాటు చుట్టూ 46 కి.మీ మేర వాకింగ్, సైక్లింగ్ ట్రాక్లను నిర్మించాలని ప్రతిపాదించారు. ఇప్పటికే గండిపేట లేక్ వ్యూ పార్కును రూ.36 కోట్లతో నిర్మిస్తే, దానికి అద్భుతమైన స్పందన వచ్చింది. అదే స్థాయిలో గండిపేట చుట్టూ సైకిల్ ట్రాక్, వాకింగ్ ట్రాక్ను ఏర్పాటు చేసే పనిలో హెచ్ఎండీఏ నిమ్నగ్నమై ఉంది.
గండిపేట పార్కులో సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు ప్రత్యేక వేదికను ఏర్పాటు చేశారు. ఒకేసారి 3వేల మంది వరకు కూర్చునేలా విశాలమైన ప్రాంగణంతో పాటు ఎత్తయిన వేదికను ఏర్పాటు చేశారు. పార్కు ప్రారంభమైన తర్వాత మొట్టమొదటి సారిగా పరంపర పేరుతో సంగీత కచేరి కార్యక్రమాన్ని సాయంత్రం నిర్వహిస్తే సుమారు 2500 మంది వరకు కచేరీని ప్రత్యక్షంగా వీక్షించారని హెచ్ఎండీఏ అధికారులు తెలిపారు.