సికింద్రాబాద్ : సికింద్రాబాద్ పరిధిలో గత ఐదు దశాబ్దాల కాలంలో చేపట్టని అభివృద్ధి పనులను కేవలం ఐదేండ్ల కాలంలో పూర్తిచేశామని డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ అన్నారు. సీతాఫల్మండి డివిజన్ పరిధిలో దాదాపు రూ.80 లక్షల వ్యయంతో చేపడుతున్న వివిధ అభివృద్ధి పనులను స్థానిక కార్పొరేటర్ సామల హేమ, అధికారులతో కలిసి డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ మంగళవారం ప్రారంభించారు.
బడీ మసీద్, హీరసింగ్ గల్లి ప్రాంతాల్లో రూ.54 లక్షల వ్యయంతో రహదారుల పునర్నిర్మాణం, బ్రాహ్మణ బస్తీలో రూ. 25 లక్షల ఖర్చుతో వర్షపు నీటి కాలువ నిర్మాణం పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్ మాట్లాడుతూ సికింద్రాబాద్ను సమస్యల రహిత నియోజకవర్గం గా తీర్చిదిద్దుతామని చెప్పారు.
వర్షాల వల్ల ఇబ్బందుల నివారణకు చేపట్టిన ఏర్పాట్లు మంచి ఫలితాలు అందిస్తున్నాయని అన్నారు. ఈ నేపథ్యంలో చిలకలగూడ బడీ మసీద్ నుంచి కింది బస్తీ, వీరయ్య గల్లి, ఉప్పరి బస్తి, ఫ్రైడే మార్కెట్, మార్కండేయ నగర్, బ్రాహ్మణ బస్త్తీ తదితర ప్రాంతాల్లో పాదయాత్ర నిర్వహించారు.
భవానీ నగర్ నుంచి కింది బస్తీ మీదుగా బౌద్దనగర్లోని వివిధ ప్రాంతాల వరకు సాగే ప్రధాన నాలా పూడిక తీసివేత పనులను వెంటనే చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జీహెచ్ఎంసీ డిప్యూటీ కమీషనర్ దశరథ్, ఇంజినీరింగ్ అధికారి ఆశలత, జలమండలి డీజీఏం వై.కృష్ణ, అధికారులు రఘు, అన్విత్ కుమార్, మధురిమ, నేతలు కిషోర్ కుమార్, రామేశ్వర్ గౌడ్, కరాటే రాజుతో పాటు ఇతర నాయకులు పాల్గొన్నారు.