బంజారాహిల్స్/ఖైరతాబాద్/హిమాయత్నగర్, జనవరి 18: కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా కంటి పరీక్షలు చేయించుకునేవారందరి వివరాలు ట్యాబ్ ద్వారా ఆన్లైన్లో నమోదు చేయాలని జిల్లా వైద్యశాఖ అధికారి డా.వెంకటి సిబ్బందికి సూచించారు. గురువారం ప్రారంభం కానున్న కంటి వెలుగు కార్యక్రమం సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు ఇతర అంశాలపై సూచనలు అందించేందుకు బుధవారం జిల్లా వైద్యాధికారి డా.వెంకటి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 7లోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది పాల్గొన్నారు.
పీహెచ్సీ వైద్యాధికారి డా. కార్తీక్ నేతృత్వంలో సిబ్బందిని ఉద్దేశించి జిల్లా వైద్యాధికారి డా.వెంకటి మాట్లాడుతూ.. పరీక్షలకు వచ్చేవారికి ఇబ్బందులు లేకుండా చూడాలని, బస్తీలు కాలనీల్లో కంటి వెలుగు కార్యక్రమం మీద అవగాహన కల్పించాలన్నారు. సిబ్బంది కచ్చితంగా ఉదయం 9నుంచి సాయంత్రం 4దాకా కంటి వెలుగు కేంద్రంలో ఉండాల్సిందే అని, కంటి వెలుగు కోసం కేటాయించిన అదనపు సిబ్బంది సకాలంలో చేరుకోకపోతే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఏరియా మ్యాపింగ్ చేసుకొని అన్ని ఇండ్లను కవర్ చేయాలని ఆశవర్కర్లను ఆదేశించారు. ప్రత్యేకంగా ఇచ్చిన ట్యాబ్స్లో ఎప్పటికప్పుడు వివరాలను నమోదు చేయాలన్నారు.
కేశవ స్మారక ప్రజా చికిత్సాలయంలో
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కంటి వెలుగు రెండో విడత కార్యక్రమం హిమాయత్నగర్ డివిజన్లోని కేశవ స్మారక ప్రజా చికిత్సాలయం ఆవరణలో ప్రారంభమవుతుందని హిమాయత్నగర్ కార్పొరేటర్ జి.మహాలక్ష్మి, బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు యాదగిరి సుతారి బుధవారం వేర్వేరు ప్రకటనలో తెలిపారు. వైద్య శిబిరానికి వచ్చే సమయంలో తప్పనిసరిగ్గా ఆధార్ కార్డును వెంట తెచ్చుకోవాలని సూచించారు.