సిటీబ్యూరో, మే 19 (నమస్తే తెలంగాణ) : గ్రేటర్లో బస్సులు సంఖ్య పెంచాలంటూ విద్యార్థులు, ప్రయాణికులు ఆర్టీసీ అధికారులకు ఎన్ని సార్లు తెలిపినా ఆ దిశగా ఆర్టీసీ అడుగులు వేయడం లేదు. రద్దీ ప్రాంతాల్లో బస్సులు లేక ప్రయాణికులు నానా అవస్థలు పడుతున్నారు. ఇప్పటికే ఆర్టీసీ అధికారులు వివిధ మార్గాల్లో రూట్ స్టడీ చేసి బస్సుల సంఖ్య పెంచాల్సిన అవసరంపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. కానీ త్వరలో విద్యాసంస్థలు ప్రారంభం కాబోతున్నా అధికారులు బస్సుల పెంపుపై దృష్టి సారించడం లేదు. నగర శివారు ప్రయాణికులు సైతం గమ్యస్థానాలకు చేరుకోవడానికి ఆగమాగమవుతున్నారు.
గత ఏడాది ఏప్రిల్, మే నెలల్లో ప్రజా సంఘాలు, విద్యార్థులు కలిసి లక్ష సంతకాల క్యాంపెయిన్ నిర్వహించి బస్సులు పెంచాలని డిమాండ్ చేశారు. క్యాంపెయిన్ రిపోర్ట్ను ఆర్టీసీ ఉన్నతాధికారులకు అందించారు. మరోవైపు మహాలక్ష్మి ఉచిత బస్సు పథకంతో సిటీ బస్సుల్లో ఆక్యుపెన్సీ రేషియో 95శాతానికి పెరిగింది. గ్రేటర్ జోన్ పరిధిలో ఆర్టీసీ నడుపుతున్న సిటీ బస్సులో రోజు 24 లక్షల మంది ప్రయాణాలు సాగిస్తుండగా వారిలో 15-18 లక్షల మంది వరకు మహిళలే ఉంటున్నారు. ప్రయాణికుల రద్దీ రెట్టింపైనా ఆర్టీసీ అధికారులు 25 బస్ డిపోల మేనేజర్లు రద్దీ సమయాల్లో చర్యలు తీసుకోవడం లేదు. ఫలితంగా నగర శివార్లకు వెళ్లాలంటే బస్సులు లేక ప్రయాణికులు నానా అవస్థలు పడుతున్నారు. ప్రధాన మార్గాల నుంచి శివార్లకు బస్సులు ఉండటం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.