అడ్డగుట్ట, జూన్ 21 : తొలిదశ ఉద్యమాన్ని ముందుండి నడిపించిన మహనీయుడు ప్రొఫెసర్ జయశంకర్ అని డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ అన్నారు. బుధవారం జయశంకర్ వర్ధంతి సందర్భంగా సీతాఫల్మండిలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి ఉపసభాపతి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పద్మారావు గౌడ్ మాట్లాడుతూ.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం అలుపెరుగని పోరాటం చేసిన గొప్ప వ్యక్తి జయశంకర్ అని కొనియాడారు. జయశంకర్ ఆశయాలకనుగుణంగా సుపరిపాలనను అందిస్తున్న ఘనత కేసీఆర్కే దక్కుతుందని ఆయన గుర్తు చేశారు.
లాలాపేటలో ..
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనకై గల్లీ నుండి ఢిల్లీ దాకా ప్రజలందరినీ ఒక్కతాటిపైకి తీసుకొచ్చిన మహనీయుడు ప్రొఫెసర్ జయశంకర్ అని డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతాశోభన్రెడ్డి కొనియాడారు. ప్రొఫెసర్ జయశంకర్ 12వ వర్ధంతిని పురస్కరించుకొని లాలాపేటలోని ఆయన విగ్రహానికి డిప్యూటీ మేయర్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తన చివరి శ్వాస వరకు తెలంగాణ కోసమే పోరాడిన మహోన్నతమైన మనిషి జయశంకర్ సార్ అని అన్నారు. నాలుగు దశాబ్దాలు ఉద్యమాన్ని సజీవంగా ఉంచడంలో కీలకపాత్ర పోషించారన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ కార్మిక విభాగం అధ్యక్షుడు మోతె శోభన్రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు సునీల్ ముదిరాజ్, నాగేశ్వర్ రావు, మల్లిఖార్జున్, వనజలక్ష్మి, యాదగిరితో పాటు తదితరులు పాల్గొన్నారు.
అడ్డగుట్టలో…
అడ్డగుట్టలో స్థానిక కార్పొరేటర్ లింగాని ప్రసన్న లక్ష్మి పార్టీశ్రేణులతో కలిసి ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నగర గ్రంథాలయ డైరెక్టర్ లింగాని శ్రీనివాస్, పార్టీశ్రేణులు సత్తయ్య గౌడ్, శ్రీనివాస్ గౌడ్, మహ్మద్, వడ్లూరి రవి, గోపి, నర్సింగ్తో పాటు తదితరులు పాల్గొన్నారు.