సికింద్రాబాద్, నవంబరు 28: సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాన్ని అభివృద్ధికి చిరునామాగా మార్చి, ప్రజలకు సంక్షేమ ఫలాలను అందించడంతో పాటు వారి అవసరాలను నిరంతరం తీర్చుతున్నామని డిప్యూటీ స్పీకర్, సికింద్రాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి తీగుళ్ల పద్మారావు గౌడ్ అన్నారు. నియోజకవర్గంలో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా మంగళవారం వివిధ ప్రాంతాల్లో కార్పొరేటర్లు, నేతల ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీలు నిర్వహించారు.
నగర డిప్యూటీ మేయర్ శ్రీలతా రెడ్డి, కార్పొరేటర్లు హేమ, శైలజ, సునీత, ప్రసన్న లక్ష్మి, యువనేతలు కిషోర్ కుమార్, కిరణ్ కుమార్, రామేశ్వర్ గౌడ్, త్రినేత్ర గౌడ్, సీనియర్ నేతలు మోతె శోభన్ రెడ్డి, కరాటే రాజు, కంది నారాయణ, శ్రీనివాస్లతో పాటు పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు ఈ బైక్ ర్యాలీల్లో పాల్గొన్నారు. ముందుగా సీతాఫల్మండి వద్ద నుంచి బైక్ ర్యాలీని పద్మారావు గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా పద్మారావు గౌడ్ మాట్లాడుతూ, సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో 50 ఏండ్లలో చేపట్టని ఎన్నో పనులను కేవలం గడచిన పదేళ్ళ వ్యవధిలోనే తాము చేపట్టామని తెలిపారు.