సికింద్రాబాద్ : అప్సా, క్వెస్ట్ సంస్థలు సంయుక్తంగా చేస్తున్న కార్యక్రమాలు యువతీ యువకులు సన్మార్గంలో నడిచేందుకు ఎంతో తోడ్పాటునందిస్తున్నాయని జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతాశోభన్రెడ్డి అన్నారు. ఈ మేరకు బుధవారం లాలాపేటలోని వినోభానగర్ కమిటీ హాల్లో అప్సా, క్వెస్ట్ సంయక్త ఆధ్వర్యంలో కంప్యూటర్ ట్రైనింగ్ సర్టిఫికెట్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. మూడు నెలలుగా కంప్యూటర్, ఇంగ్లిష్, వ్యక్తిగత నైపుణ్యంపై నిరుద్యోగ యువతీ యువకులకు ఉచిత శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించారు. సుమారు 60 మంది నిరుద్యోగ యువత శిక్షణ పూర్తి చేసుకున్న సందర్భంగా సర్టిఫికెట్ల ప్రదానోత్సవ కార్యక్రమానికి డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత, టీటీయూసీ వ్యవస్థాపక అధ్యక్షుడు మోతే శోభన్రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ మాట్లాడుతూ నిరుద్యోగ యువత మంచి మార్గంలో వెళ్లే విధంగా శిక్షణ ఇస్తూ వారికి ఉపాధిని కల్పిస్తూ సర్టిఫికెట్లు అందజేయడం గర్వించదగ్గ విషయమన్నారు. దేశానికి రైతులతో పాటు వెన్నుముకగా నిలుస్తున్న యువత చెడు మార్గంలోకి వెళ్లకుండా మంచి ఆలోచనలతో ముందకుసాగాలన్నారు. కార్యక్రమంలో ఐసీడీసీ సునంద, సీఐ రమేష్ నాయక్, అప్సా ప్రోగ్రాం మేనేజర్ ప్రవేని, అప్సా కోఆర్డినేటర్ బసవ రాజు, వినోబానగర్ బస్తీ నాయకులు ఎర్ర నాగరాజు, వెంకటేష్, శ్యామ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.