హయత్నగర్, జనవరి 11 : గంజాయి, డ్రగ్స్ అక్రమ రవాణా నివారణ కోసం ఎక్సైజ్శాఖ కమిషనర్ శ్రీధర్, డైరెక్టర్ వి.బి.కమలాసన్రెడ్డి ఆదేశాల మేరకు రంగారెడ్డి జిల్లా డిప్యూటీ కమిషనర్ డేవిడ్ రవికాంత్ పర్యవేక్షణలో సరూర్నగర్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ రవీందర్రావు, ఏఈఎస్ హనుమంతరావు నేతృత్వంలో హయత్నగర్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ లక్ష్మణ్గౌడ్ ఆధ్వర్యంలో గురువారం తెల్లవారుజామున అబ్దుల్లాపూర్మెట్, రామోజీఫిల్మీసిటీ దగ్గర చేపట్టిన వాహనాల తనిఖీల్లో ఎనిమిది నిందితుల వద్ద రూ.7.50 లక్షలు విలువైన 24 కిలోల గంజాయి ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ పోలీసులు మాట్లాడుతూ ఏపీ, ఒడిశా, ఛత్తీస్ఘడ్ రాష్ర్టాల నుంచి వచ్చే అన్ని ప్రైవేట్, ఆర్టీసీ ఇతర వాహనాల రాకపోకలపై ముమ్మరంగా తనిఖీలు చేపట్టామని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్లోని విశాఖ జిల్లా, పలాస, రాజమండ్రి, నర్సీపట్నం, అరకు, ఒడిశాలోని మల్కాన్గిరి నుంచి ఢిల్లీ, మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ ప్రాంతాలకు గంజాయిని రవాణా చేస్తున్నట్లు పట్టుబడిన నిందితులు తమ విచారణలో వెల్లడించారని పేర్కొన్నారు. గంజాయి ప్యాకెట్లను తరలించడం వల్ల రూ.10 వేల వరకు కమీషన్ వస్తున్నట్లు తెలిపారు. యువత ఇలాంటి అక్రమ కేసుల్లో చిక్కుకుని తమ బంగారు భవిష్యత్ను నాశనం చేసుకుంటున్నారని, ఈ లింక్ను అరికట్టేందుకు ఎక్సైజ్శాఖ నిరంతరం చర్యలు చేపట్టిందని, ఇలాంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠినంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ దాడులలో సరూర్నగర్ డీటీఎఫ్ సీఐ సత్యనారాయణ, ఎస్ఐలు సరళ, హనుమంతు, వెంకన్న, ఎండీ పాష, హనుమంతు, సిబ్బంది పాల్గొన్నారు.